ములుగు, నవంబర్ 21 (నమస్తేతెలంగా ణ): ములుగులో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఆర్వో కార్యాలయం వద్ద గూండాగిరి చేశారు. సోమవారం రాత్రి 9 నుంచి అర్ధరాత్రి వరకు ఆరు గంటలపాటు ఆర్వోను నిర్బంధించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ధనసరి అనసూయ(సీతక్క) ఫొటో ఈవీఎం మెషిన్లో చిన్న సైజు చేసి కనిపించకుండా చేశారని ఆరోపిస్తూ హల్చల్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు.
‘వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. అప్పు డు మీ అంతు చూస్తా’నంటూ బెదిరించారు. కార్యాలయంలో ఉన్న ఆర్వో అంకిత్ బయటకు వచ్చి సమస్యను అడిగి తెలుసుకొని.. విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిశీలిస్తామని చెప్పినా పట్టించుకోకుండా.. కలెక్టర్ ఎవరు? నియోజకవర్గానికి ఆర్వోనే బాస్ కదా! ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి అంటూ పట్టుబట్టారు.
పోలీసు లు, ఎన్నికల అధికారులు ఎంత నచ్చజెప్పినావినకుండా కాంగ్రెస్ నాయకులు కలెక్టర్, ఆర్వో, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీతక్క అర్ధరాత్రి ఒంటి గంట కు ఆర్వో కార్యాలయానికి చేరుకొని అధికారులపై చిర్రుబుర్రులాడారు. చేసేది లేక ఏఆర్వో, ములుగు తహసీల్దార్ విజయ్భాస్కర్ బయటకు వచ్చి సీతక్కతోపాటు కాంగ్రెస్ నాయకులకు రెండు చేతులు జోడించి దండం పెట్టి.. మంగళవారం ఉదయం రావాలని, కలెక్టర్ సమక్షంలో తమ అభ్యంతరాలను పరిశీలిస్తామని చెప్పి వేడుకోవడంతో ఆందోళనను విరమించారు.
ఉదయమే కాంగ్రెస్ నాయకులు ఆర్వో కార్యాలయానికి వెళ్లి తమ అభ్యంతరాలను తెలియజేయగా అధికారులు నివృత్తి చేసినట్టు సమాచారం. ఈ మాత్రం దానికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముందని? సీతక్క, ఆమె అనుచరులు ప్రవర్తించిన తీరును ప్రజలు ఖండిస్తున్నారు.