హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. రోజువారీ కేసుల సంఖ్య 600కు చేరువైంది. నెలరోజుల్లో రోజువారీ కేసులు ఏకంగా ఐదురెట్లు పెరిగాయి. పాజిటివిటీ రేటు దాదాపు రెండున్నర రెట్లు అధికంగా నమోదైంది. గత నెల 7న రాష్ట్రంలో 119 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మూడోవేవ్ ముగిసిన తర్వాత మొట్టమొదటిసారిగా అదేరోజు వంద కేసులు దాటాయి. పాజిటివిటీ రేటు సుమారు 0.90 శాతంగా నమోదైంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 592 మందికి పాజిటివ్గా తేలింది. పాజిటివిటీ రేటు 2.15 శాతంగా నమోదైంది. హైదరాబాద్ జిల్లాలో గురువారం 331 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో మూడొంతులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనే వెలుగుచూస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. టెస్టుల సంఖ్య పెంచింది.
పట్టించుకోని కేంద్రం..
కొవిడ్ కేసులు పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ప్రికాషన్ డోస్పై నిర్ణయం తీసుకోవడం లేదు. ఆర్థికంగా భారం పడుతుండటంతో ప్రజలు ప్రికాషన్ డోస్కు దూరంగా ఉంటున్నారని, కొవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మూడో డోస్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఇప్పటికి మూడుసార్లు విన్నవించినా కేంద్రం నుంచి స్పందన లేదు. దీంతో ప్రజలు ప్రికాషన్ డోస్కు దూరమవుతున్నారు. దేశవ్యాప్తంగా సగటున 5 శాతం మంది మాత్రమే మూడో డోస్ వేసుకున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి.