కొల్లాపూర్ రూరల్/చిన్నంబావి, మే 24 : వనపర్తి జిల్లా లక్ష్మీపల్లిలో జరిగిన శ్రీధర్రెడ్డి హత్య వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయకోణంలో హత్య జరిగిందని గ్రామస్థులు పేర్కొంటుండగా, వారి వాదనకు బలం చేకూరే విధంగా హత్య జరిగిన రోజు రాత్రి లక్ష్మీపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు కొందరు గ్రామ శివారులో ఉన్న రామరాజుయాదవ్ అనే రైతు పొలం ఫెన్సింగ్ కడ్డీలను ధ్వంసం చేశారు.
తన పొలంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో ఈ దృశ్యాలు రికార్డు అయినట్టు రామరాజు తెలిపాడు. కాగా, శ్రీధర్రెడ్డి హత్య.. ఫెన్సింగ్ కడ్డీలు ధ్వంసం చేసిన వ్యక్తులకు ఏమైనా సంబంధం ఉందా అన్నకోణంలో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఎంతో సౌమ్యుడైన శ్రీధర్రెడ్డి హత్య ముమ్మాటికి రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే జరిగి ఉంటుందని స్థానికంగా చర్చ జరుగుతున్నది. హత్యకు కారకులను వెంటనే అరెస్టు చేయాలని గ్రామ ఉప సర్పంచ్ స్వామి డిమాండ్ చేశారు. శ్రీధర్రెడ్డి హత్య జరిగిన స్థలాన్ని శుక్రవారం ఎస్పీ రక్షిత కే.మూర్తి, డీఎస్పీ వెంకటేశ్వరావు, సీఐ నాగభూషణం పరిశీలించారు. డాగ్స్కాడ్తో చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు.