హైదరాబాద్, మార్చి 20(నమస్తే తెలంగాణ): అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తున్న రైతుబీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తున్నదా? అందుకే బడ్జెట్లో నిధులు కేటాయించలేదా? కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయబోతున్నట్టు ప్రకటించిన సర్కార్.. అందుకే రైతుబీమాకు చరమగీతం పాడిందా? అనే ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం నాటి బడ్జెట్లో రైతుబీమా పథకానికి నిధులు కేటాయించలే దు. నిరుడు బడ్జెట్లో రూ.1,167.92 కోట్లు కేటాయించి, ఈ బడ్జెట్లో నయాపైసా కూడా విదిల్చకపోవడంతో రైతుబీమా అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భూమి ఉన్న రైతు కుటుంబం మొత్తానికి వర్తించే రైతుబీమా పథకాన్ని రద్దు చేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
తాజా బడ్జెట్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వివిధ కారణాలతో కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం చెల్లించనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు కుటుంబ జీవిత బీమా అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. రూ.4వేల కోట్లు కూడా కేటాయించారు.
ఇందిరమ్మ బీమా పథకం కుటుంబంలో కేవలం ఒక్కరికే వర్తించే అవకాశం ఉన్నట్టు తె లిసింది. అది కూడా కుటుంబ పెద్దకు మా త్రమే వర్తించేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్టు తెలిసింది. రేషన్కార్డు కలిగిన వారికి మాత్రమే అమలు చేయనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. రైతుబీమా పథకంలో కు టుంబంలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ ప థకం వర్తిస్తుంది. రైతుబీమా పథకం కుటుంబంలో అందరికీ వర్తిస్తుంటే.. ఇందిరమ్మ బీ మా పథకం మాత్రం కుటుంబంలో ఒక్కరికే వర్తించే అవకాశం ఉన్నది. రైతుబీమా పథకంలో ఏటా 42లక్షలకు పైగా రైతులు తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు. వీరిలో ఏ టా వివిధ కారణాలతో 20వేల మంది రైతులు అకాల మరణం చెందుతుండగా, వీరి కుటుంబాలకు రైతుబీమా కింద రూ.5 లక్షల పరిహారం అందుతున్నది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ బీమా అమలు చేస్తే ఎంతమందికి పరిహారం అందుతుందనేది ప్రశ్నార్థకంగా ఉంది.
రైతుల అకాల మరణంతో ఆ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని రోడ్డున పడే పరిస్థితిని చూసి చలించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు 2018లో రైతుబీమా పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో భాగంగా 18-59 ఏండ్ల వయస్సు కలిగిన వారిలో తమ పేరున భూమి కలిగిన ప్రతి రైతుకూ రూ. 5 లక్షల బీమా కల్పించారు. ఇందుకోసం ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రైతులు చెల్లించాల్సిన ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించేది. ఇలా రైతులకు రూ.6,680 కోట్ల పరిహారం అందింది. ఇప్పుడు అంతటి గొప్ప పథకాన్ని రద్దు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొంటూనే పథకాలను రద్దు చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.