నమస్తే తెలంగాణ నెట్వర్క్;కొవిడ్ మహమ్మారి రాకతో ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొనేందుకు నిత్యం వ్యాయామం చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ మైదానాల బాట పడుతున్నారు. మరికొంత మంది జిమ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఓపెన్ జిమ్లకు విశేష స్పందన లభిస్తున్నది. ఇంతకాలం ప్రైవేట్ రంగానికే పరిమితమైన జిమ్లను, ఓపెన్ జిమ్ల పేరిట ప్రభుత్వమే ఏర్పాటుచేస్తుండటంతో ప్రజలకు ముఖ్యంగా యువతకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతున్నది.
మార్నింగ్, ఈవినింగ్ వాకింగ్ చేసే ప్రాంతాల్లో, పార్కుల్లో ఏర్పాటుచేసిన ఈ ఓపెన్ జిమ్లలో తీరొక్క పరికరం, సకల సదుపాయాలు కల్పిస్తుండటంతో ఇటు ఆహ్లాదం, అటు ఆరోగ్యం ఒకేసారి పొందుతున్నారు. మహిళలు కూడా పురుషులకు దీటుగా వ్యాయామం చేస్తూ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇప్పటికే 443 ఓపెన్ జిమ్లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఒక్క జీహెచ్ఎంసీలోనే 74 ప్రాంతాల్లో ఈ ఓపెన్ జిమ్లు ఉన్నాయి. నల్లగొండ పట్టణంలో 57 ప్రాంతాల్లో, కరీంనగర్లో 30, సూర్యాపేటలో 5, మహబూబ్నగర్లో 3 చోట్ల ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనేక పట్టణాలు, గ్రామాల్లో వీటిని నెలకొల్పారు. మరిన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేయాలని విజ్ఞప్తులు వస్తుండటంతో అధికారులు అనువైన స్థలాల కోసం అన్వేషిస్తున్నారు.