హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు శుక్రవారం నుంచి 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ హెల్త్ వర్సిటీ తెలిపింది. నీట్ కటాఫ్ కన్నా ఎక్కువ మార్కులు సాధించినవారే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని స్పష్టం చేసింది. జనరల్ క్యాటగిరీకి, ఈడబ్ల్యూఎస్ కోటాకు 137 మార్కులు (50 శాతం), ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆయా క్యాటగిరీల్లోని దివ్యాంగులకు 107 మార్కులు (40 శాతం), జనరల్ క్యాటగిరీ దివ్యాంగులకు 121 మార్కులు (45 శాతం) కటాఫ్గా నిర్ణయించినట్టు వెల్లడించింది. రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజును జనరల్, బీసీ క్యాటగిరీ విద్యార్థులు రూ.3,500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2,900 చెల్లించాలని సూచించింది. వివరాలకు www.knruhs.telangana. gov.in సంప్రదించాలని వర్సిటీ కోరింది.
అదనంగా 520 మెడికల్ సీట్లు..
రాష్ట్రంలో 56 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో 8,340 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 15 శాతం సీట్లు ఆలిండియా కోటాలో భర్తీ చేస్తారు. మిగతా సీట్లు రాష్ట్ర కోటాలో కన్వీనర్, మేనేజ్మెంట్ కోటాల్లో భర్తీ చేస్తారు. 2014 జూన్ 2 తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లను 100 శాతం తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో తెలంగాణ విద్యార్థులకు అదనంగా 520 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉండగా, తొమ్మిదేండ్లలో కొత్తగా 36 కాలేజీలు వచ్చాయి.