ఖైరతాబాద్, సెప్టెంబర్ 12 : నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించడం చారిత్రాత్మకం..ఆయన గొప్ప ఆలోచనకు కన్నీళ్లతో వందనం పలుకుతున్నానని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. ఆలిండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని..మరికొందరు అమరులయ్యారని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఒక్క ఆర్టికల్ లేకుంటే తెలంగాణ సాధ్యం కాదని సీఎం చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు. ఈ అంశం తీర్మానంతో ఆగిపోవద్దని, దేశంలోని 28 రాష్ర్టాల ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేయాలన్నారు. అలా చేస్తే తాను సీఎం వెన్నంటి వస్తానని గద్దర్ చెప్పారు. ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్రాజ్, యాదగిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.