కోరుట్ల, జనవరి 16: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని తాండ్రియాల్ ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి నలుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారు. డబ్బులు కాజేసి పారిపోతుండగా, పోలీసులు పక్కా సమాచారంతో స్పాట్కు చేరుకొని అడ్డగించారు. దీంతో డబ్బుల బాక్స్లను అక్కడే పడేసి దొంగలు పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల – వేములవాడ రోడ్డులో ఉన్న తాండ్రియాల్ బ్రాంచి ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంలోకి ఆదివారం అర్ధరాత్రి 1.15 గంటల సమయంలో దొంగలు చొరబడ్డారు. ముందుగా ఏటీఎం షటర్ను మూసివేసి సీసీ కెమెరాలపై స్ప్రే చల్లారు. గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎం మిషన్ను తెరిచిన దొంగలు అందులో 5 బాక్స్ల్లో అమర్చిన డబ్బులను దొంగిలించారు. దొంగలు ఏటీఎం తెరిచే సమయంలో హైదరాబాద్లోని బ్యాంకు సర్వేలైన్ టీమ్కు వార్నింగ్ సిగ్నల్స్ అందాయి. వెంటనే కోరుట్ల ఎస్ఐ సతీశ్కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా, 8 నిమిషాల్లోనే పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బంది స్పాట్కు చేరుకొన్నారు. పోలీస్ జీపు.. దొంగల వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. వాహనంలో వెనుక వైపు కూర్చున్న దొంగతో సహా వెనుక పెట్టిన డబ్బుల బాక్స్లు రోడ్డుపై పడిపోయాయి. రోడ్డుపై పడ్డ డబ్బు బాక్సుల పైనుంచి వాహనం వెళ్లిపోవడంతో సుమారు రూ.3 లక్షల నగదు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయింది. దొంగ లు ఏటీఎం నుంచి దొంగిలించిన 5 డబ్బు పెట్టెల్లో నాలుగింటిని పోలీసులు స్వాధీ నం చేసుకొన్నారు. మరో ఖాళీ బాక్సును దొంగలు ఎత్తుకెళ్లారు. మొత్తంగా ఏటీఎంలో ఉన్న రూ.19 లక్షల 200 కరెన్సీని పోలీసులు స్వా ధీనం చేసుకొని ఠాణాకు తరలించారు. జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్ దొంగతనం జరిగిన ఏటీఎంను పరిశీలించారు. మూడు పోలీస్ బృం దాలు దొంగల ఆచూకీ కోసం గాలిస్తున్నాయి.