Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల : రాఖీ పండుగకు తమ్ముడి ఇంటికి వచ్చిన అక్క తెల్లారి రాఖీ కట్టి పండుగను సంతోషంగా జరుపుకోవాలకున్నది. అయితే, పొలం వద్దకు వెళ్లిన తమ్ముడు తెల్లవారేసరికి బావిలో పడి మృతిచెందడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం అలుముకున్నది. తమ్ముడి మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదిస్తూనే చివరిసారిగా రాఖీ కట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలకేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
ముస్తాబాద్కు చెందిన అనవేని నర్సింలు(38)కు భార్య మంగ, కూతురు హారిక, కొడుకు రేవంత్ ఉన్నారు. నర్సింలు ముస్తాబాద్లో ఐదెకరాలు కౌలుకు తీసుకొని పొలం సాగు వేశాడు. రాఖీ పండుగకు తమ్ముడు నర్సింలుకు రాఖీ కట్టేందుకు అక్క రాజవ్వ గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం నుంచి బుధవారం ముస్తాబాద్కు వచ్చింది. తెల్లవారి రాఖీ కట్టి పండుగను సంతోషంగా జరుపుకోవాలనుకున్నది. అయితే రాత్రి పొలం వద్దకు వెళ్ళిన నర్సింలు గురువారం ఉదయం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్ళి చూశారు. బావిలో కరెన్సీ నోట్లు నీటిపై తేలడంతో అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే స్థానికుల సహకారంతో బావిలో నీటిని మోటర్ల సాయంతో తొలగించడంతో నర్సింలు మృతదేహం బయటపడింది. మృతదేహాన్ని చూసి భార్యా బిడ్డలు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. రాఖీ కట్టేందుకు వచ్చిన అక్క రాజవ్వ రాఖీ ఎవరికి కట్టాలె తమ్మి.. దేవుడెంత పనిజేసె తమ్మి అంటూ తమ్ముడి మృతదేహంపై పడి విలపించింది. చివరిసారిగా అక్కడే రాఖీ కట్టి రోదించిన తీరు స్థానికులను కంటతడిపెట్టించింది. కాగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.