హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట మండలం, దుబ్బాకలో విఠలేశ్వరాలయంగా పిలువబడుతున్న శైవాలయంలో శివలింగ పీఠం కాళీగాదేవీ సమేతంగా ఆసీనుడైన యోగభైరవుని శిల్పాన్ని గుర్తించారు. ఈ మేరకు ఈ శిల్పం సుఖాసీన మూర్తులలో భైరవుడు పర హస్తాలలో పరశువు, శ్వాన పతకాన్ని, నిజ(మందరి) హస్తాలలో కుడిచేత అక్షమాల ధరించి, ఎడమచేత ప్రసారితహస్తంతో దర్శనమిస్తున్నాడని ప్రతిమాలక్షణ వేత్త పీ మహేశ్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు దేవి ఖట్వాంగంతో, ప్రసారిత హస్తముతో కనిపిస్తుందని, ప్రతిమ లక్షణాలపరంగా యోగభైరవ, కాళీకలని తెలిపారు.
జయదుర్గతో క్రోధ భైరవుడు, మహిషమర్ధినితో వక్త్రనాథుడు, యశోరేశ్వరితో చండభైరవుడు, మహాపీఠ నిరూపణలో కామరూప ఆరాధనలో కనిపించే జంటల్లో కాళీ, యోగేశ భైరవులు ఉంటారని వారు పేర్కొన్నారు. ఈ శిల్పం దేశంలోనే అరుదైనదిగా తెలిపారు. పాశుపత శైవం పద్దెనిమిది మంది ఆచార్యులతో దేశమంతా విస్తరించిందని, తాత్వికపరమైన భేదాలతో కాపాలిక, కాలాముఖ అనే రెండు ప్రధాన వర్గాలుగా విడిపోయిందని పేర్కొన్నారు.
6వ శతాబ్దం నాటికి తెలుగు రాష్ర్టాల్లో కాలముఖ ప్రస్థానం మొదలైందని, 9వ శతా బ్దం నుంచి 13వ శతాబ్దం మధ్యకాలంలో ఆధిపత్యమతంగా కొనసాగిందని వివరించారు. దేవి, శక్తి, దుర్గ, అంబిక, గౌరీ, అప ర్ణ, పార్వతీ, కాళి పేర్లతో మహాశివుని భైరవ రూపానికి పత్నిగా ఆయా దేవీ రూపాలతో ఆరాధించబడ్డ 51పీఠాల విశేషాలు, 42 పవిత్ర ఆలయాల గురించి తం త్ర చూడామణి చెప్పుతుందని వివరించారు.