హైదరాబాద్, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ): గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన రాత పరీక్ష పలుచోట్ల గందగోళంగా మారింది. అధికారుల మధ్య సమన్వయలోపంతో పలుచోట్ల నిర్ణీత సమయానికి కంటే ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైంది. టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ ఆధ్వర్యంలో 492 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఉదయం 11నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు ఆరగంట ముందే చేరుకోవాలని సూచించారు. కానీ పలుచోట్ల పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైంది. గంట ఆలస్యం కావడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. 5వ తరగతి ప్రవేశాలకు, 6 నుంచి 9 తరగతుల్లోని ఖాళీ సీట్ల కోసం మొ త్తం 1,82,061మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 1,72,842(94.93శాతం) మంది మా త్రమే హాజరయ్యారు.
గురుకులాల ప్రవేశ పరీక్షకు సంబంధించి పశ్నపత్రం తారుమారు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన ఘటన ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకు ల పాఠశాల వద్ద చోటుచేసుకున్నది. ఈ గురుకులంలో 510మంది 7వ తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష రాయడానికి కేంద్రం ఏర్పాటు చేశారు. 483మంది హాజరయ్యారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగాల్సిన పరీక్ష 3గంటల పాటు ఆలస్యంగా జరిగింది. 7వ తరగతి ప్రశ్నాపత్రాలకు బదులుగా 8వ తరగతి ప్రశ్నాపత్రాలు రావడంతో జాప్యం జరిగింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో చేశారు.
తమ పిల్లలు ఉదయం అల్పాహారం తినకుండా పరీక్ష రాయడానికి వెళ్లారని, ఆలస్యం కావ డంతో ఖాళీ కడుపుతో పరీక్ష ఎలా రాస్తారని నిలదీశారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు వచ్చి విద్యార్థులకు అరటిపండ్లు, బిస్కెట్లు ఇవ్వడంతో పాటు పరీక్ష తర్వాత భోజన వసతి కల్పిస్తారని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. గురుకుల పాఠశాలల రాష్ట్ర అధికారి నిర్మల పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ప్రిన్సిపాల్, సిబ్బంది నిర్లక్ష్యం లేదని.. ప్రింటింగ్ ప్రెస్వాళ్లే నిర్లక్ష్యం చేశారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.