మహబూబాబాద్ : కొవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డొస్ 100% సాధించడంలో డాక్టర్ల కృషి మరువలేనిదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం రోడ్లు, భవనాలు అతిథి గృహ ఆవరణలో డాక్టర్లకు అభినందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ శశాంక అధ్యక్షతన మంత్రి నిర్వహించారు.
మంత్రి కేక్ కట్ చేసి అధికారులకు, డాక్టర్లకు తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్రంలోనే మహబూబాబాద్ జిల్లా గిరిజనులు అత్యధికంగా ఉన్న ప్రాంతమన్నారు. అందులోనూ జిల్లాలోనే అత్యంత మారుమూల మండలాలైన కొత్తగూడ, గంగారం సిగ్నల్ లేని ప్రాంతాలని, అటువంటి ప్రాంతాలలోనే ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేసి నూరు శాతం సాధించడంతో వైద్యులను ప్రత్యేకంగా అభినందించారు.
తొలుత కొవిడ్ వచ్చినప్పుడు వైద్య సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని అయినా ఆత్మవిశ్వాసంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా నడిపించడంలో జిల్లాను ముందంజ లో నిలిపారన్నారు. నిరంతరం సమీక్షిస్తూ, అధికారులను ప్రోత్సహిస్తూ వంద శాతం పూర్తి చేయటంలో జిల్లా కలెక్టర్ శశాంక విజయవంతమయ్యారని మంత్రి ప్రశంసించారు.
ఇదే స్ఫూర్తితో రెంఓ డోసు 100 శాతం పూర్తి చేయాలన్నారు.
రైతుల ధాన్యం తప్పనిసరిగా కొనుగోలు చేస్తామని, యాసంగిలో పండించే ధాన్యం భారత ఆహార సంస్థ కొనుగోలు చేయమని చెప్పినందున, రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలు చేపట్టి ఆర్థిక అభివృద్ధి సాధించాలని అన్నారు. అనంతరం మంత్రి వైద్య సిబ్బందిని సన్మానించారు.
అభినందన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు, ప్రభుత్వ ఏరియా దవాఖాన పర్యవేక్షకులు వెంకట రాములు, జిల్లా టీఎన్జీవోస్ నాయకులు వడ్డెబోయిన శ్రీనివాస్, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.