మంచిర్యాల ప్రతినిధి, బెజ్జూర్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): కట్టెల పొయ్యి తీసేసి సిలిండర్ పొయ్యి వెలిగించిన ఆ చేతులు.. మళ్లీ కట్టెల పొయ్యి పెట్టినయ్. అడవి బాట ఆపిన ఆ కాళ్లు.. మళ్లీ అడవి బాట పట్టినయ్. ఈ పుణ్యమంతా కేంద్రంలోని బీజేపీ సర్కారుదే అంటున్నారు ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరుకు చెందిన మహిళలు. గతంలో రూ. 600కే లభించిన సిలిండర్, ప్రస్తుతం రూ.1,160కు పెరగటంతో కట్టెల పొయ్యిపై ఆధారపడాల్సిన దుస్థితి వచ్చిందని చెప్తున్నారు. ఉజ్వల పథకం కింద కేంద్రం పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది. అప్పుడు రూ.600కే గ్యాస్ సిలిండర్ కావటంతో కిలోమీటర్ల కొద్దీ అడవికి వెళ్లే కన్నా, గ్యాస్ బెటర్ అనుకొని కనెక్షన్ తీసుకొన్నారు. కానీ, రూ.700, రూ.800.. అనుకుంటూ కేంద్రం ధరలు పెంచుకుంటూ పోయింది. ఒక్క సిలిండర్కే రూ.1,160 పెట్టాల్సి వస్తుండటకట్టెల పొయ్యే దిక్కాయే!
తగ్గుతున్న గ్యాస్ వాడకం
2014లో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ.414 ఉండగా, ప్రసుత్తం రూ.1,160కి చేరింది. అంటే రెండు రెట్లు పెరిగింది. దీంతో పేదలు గ్యాస్ వాడకాన్ని తగ్గించేస్తున్నారు. నాలుగేండ్ల కిందట ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద మోదీ ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది. అప్పుడు సిలిండర్ ధర రూ.600. మారుమూల ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేసి, తక్కువ ధరకే సిలిండర్లు వస్తున్నాయని కనెక్షన్లు ఇచ్చారు. ఇలా దేశవ్యాప్తంగా 2022 నవంబర్ 20 నాటికి 47,82,899 కనెక్షన్లు, గ్రామీణ ప్రాంతాల్లో 98 శాతం ఇండ్లలో గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్టు చెప్పుకొన్నారు. బెజ్జూరులో ప్రస్తుతం 2 వేల పైచిలుకు కనెక్షన్లు వచ్చాయి. కానీ, సిలిండర్ ధర పెరగటంతో 35 శాతం మంది గ్యాస్ వేయించుకోవటం మానేసినట్టు ‘నమస్తే తెలంగాణ’ పరిశీలనలో తేలింది. స్థానిక గ్యాస్ డీలర్తో మాట్లాడగా ‘ఏడాది క్రితం నెలకు 6 లోడ్ల గ్యాస్ వేసేవాళ్లం.. ఇప్పుడు నెలకు 4 లేదా 5 లోడ్లు వేస్తున్నాం. మా కనెక్షన్లలో వందలో 30 మంది 6 నెలలుగా అసలు గ్యాస్ తీసుకోవడం లేదు’ అని చెప్పారు.
బతుకుడే కష్టం.. ఇగ గ్యాసెట్ల?
మాకు ముగ్గురు పిల్లలు. నేను, నా భర్త కూలీలం. ఇద్దరం కలిసి ఎవుసం పనులకు పోతం. పొద్దంతా కష్టపడితే ఏడెనిమిది వందలు దొరుకుతయ్. గా పని కూడా రోజుండదు. మేం బతుకుడే కష్టం. మునుపు గ్యాస్ వాడేటోళ్లం. ఇప్పుడు రేటు మస్తు పెరిగింది. మళ్లా కట్టెల పొయ్యే వాడుతున్నం. కట్టెలకు పోయిన రోజు పని బందే. – జాడి పుష్పలత-రాజన్న, కుకుడ,
ఆసిఫాబాద్ జిల్లా. బెజ్జూరు మండలం
గ్యాస్ కొనుడు బంజేసినం
మేం గరిబోళ్లం. కూలీ చేసుకొని బతికేటోళ్లం. వచ్చే డబ్బులు తినడానికే సరిపోతలేవు. గ్యాస్ ధర మస్తు పెరిగింది. అందుకే 8 నెలల సంది గ్యాస్ తీసుకుంటలేం. పని కూడా సరిగా దొరుకుతలేదు. పొద్దంతా పొలం పనికిపోతే రూ.200. ఆ పైసలు ఇంట్లో సామానుకే సరిపోతయి. ఇగ గ్యాస్ కొనుడు మాతోనైతదా? సిలిండర్ ధర వెయ్యి దాటినప్పటి నుంచి గ్యాస్ బంజేసినం. వారానికోసారి అడవికిపోయి కట్టెలు తెచ్చుకుంటం. గవ్విటితోటే వంట చేసుకుంటున్నం. గ్యాస్ ఇచ్చి ఏం లాభం? మళ్లా కట్టెల పొయ్యే దిక్కాయే. – దుర్గం సుశీల, కుకుడ, బెజ్జూరు మండలం, ఆసిఫాబాద్ జిల్లా