Nagarjuna Sagar | హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ఆపరేషన్ ప్రొటోకాల్ ఖరారు కాకుండా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడంతో తెలంగాణ జలహక్కులకు తీవ్రవిఘాతం వాటిల్లనున్నది. సాగర్ ఆయకట్టు ఎల్లకాలం ఎండబెట్టాల్సిన దుస్థితి రానున్నది. సమయానికి విద్యుత్తు ప్రాజెక్టులు ఆదుకోలేని పరిస్థితి ఏర్పడనున్నది. అందుకు ప్రధాన కారణం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్కర్వ్, ఆపరేషన్ ప్రొటోకా లే కారణం. అందులోని నిబంధనలు తెలంగాణకు తీరని శాపాలుగా మారే ప్రమాదం ఉన్నది.
ఈ నేపథ్యంలోనే ఆ ముసాయిదాను కేసీఆర్ ప్రభుత్వం తీ వ్రంగా తప్పుబట్టింది. ముసాయిదా ట్రిబ్యునల్, ప్లా నింగ్ కమిషన్ అనుమతులకు విరుద్ధమని తప్పుబట్టింది. సీడబ్ల్యూసీ ప్రొటోకాల్ పూర్తిగా ఏపీకి వత్తాసు పలికేలా ఉందని తేల్చిచెప్పింది. ముసాయిదాపై చర్చించేందుకు కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) సమావేశాల్లోనే అనేకమార్లు బీఆర్ఎస్ సర్కారు తేల్చిచెప్పింది. ఆ రెకమండేషన్లను తిరస్కరించింది. కేం ద్రానికి, కేఆర్ఎంబీకి గతంలోనే ఈ మేరకు లేఖలు రాసింది. కానీ ఇప్పుడు అందుకు సంబంధించి ఆపరేషన్ ప్రొటోకాల్పై నిర్ణయం జరగకముందే ప్రాజెక్టుల నిర్వహణను బోర్డుకు అప్పగించేందుకు కాం గ్రెస్ సర్కారు అంగీకరించడం విషాదకరం.
ఎల్లకాలం సాగర్ ఎండాల్సిందే
బచావత్ ట్రిబ్యునల్ అవార్డు, ప్లానింగ్ కమిషన్ నిబంధనల ప్రకారం శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్టు మాత్రమే. నాగార్జునసాగర్కు ప్రత్యేకంగా ఎలాంటి క్యాచ్మెంట్ ఏరియా లేదు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచే జలవిద్యుత్తు ఉత్పత్తి ద్వారా సాగర్ రిజర్వాయర్కు నీరు అందుతుందని వెల్లడించాయి. సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు పూర్తిగా ఒకదానిపై ఒకటి ఆ ధారపడిన ప్రాజెక్టులు అని, ఆ రెండింటికి సంబంధించి సమగ్రమైన ప్రొటోకాల్స్ను, అదీ ట్రిబ్యునల్ అవార్డులకు అనుగుణంగా రూపొందించాల్సి ఉన్న ది.
కానీ కేఆర్ఎంబీ అందుకు విరుద్ధంగా ప్రొటోకాల్ను రూపొందించింది. 830 ఫీట్ల వరకు జల విద్యు త్తు ఉత్పత్తి చేస్తూ దిగువన సాగర్కు విడుదల చేస్తూ దానికింది ఆయకట్టుకు నీరందించాల్సి ఉన్నది. కానీ ట్రిబ్యునల్ అవార్డులకు విరుద్ధంగా సీడబ్ల్యూసీ రూ ల్కర్వ్స్ను ప్రతిపాదించింది. శ్రీశైలం రిజర్వాయర్ ఎండీడీఎల్పై ఆంక్షలు విధించింది. 854 ఫీట్లపైనే విద్యుత్తు ఉత్పత్తి చేపట్టాలని రూపొందించింది. అదే జరిగితే ఎగువ నుంచి వచ్చిన జలాలను వచ్చినట్టు గా పోతిరెడ్డిపాడు ద్వారా పెన్నా బేసిన్కు ఏపీకి తరలించుకుపోయే అవకాశం ఉన్నది. దీంతో సాగర్ ఆయకట్టు ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉన్నది.
వాస్తవంగా పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా చెన్నై తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్ఆర్బీసీ)కి 19 టీఎంసీలు.. మొత్తంగా 34 టీఎంసీలను మాత్రమే తరలించుకుపోయేందుకు ఏపీకి అవకాశం ఉన్నది. అయినా ట్రి బ్యునల్ అవార్డును పట్టించుకోకుండా ఏడేండ్లలో జల వినియోగాల ఆధారంగా ప్రొటోకాల్ను రూ పొందించింది.
ఇది తెలంగాణకు తీవ్రంగా చేటు చే యనున్నది. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభు త్వం పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీని మరింత విస్తరించుకుంటూ పోతున్నది. ఏకంగా 88 వేల క్యూసెక్కులకు పెంచుతున్నది. రాబోయే రోజుల్లో ఏపీ పెద్దమొత్తంలో జలాలను బేసిన్ అవతలికి తరలించే అవకాశం ఉన్నది. ఇక భవిష్యత్తులో సాగర్కు నీళ్లు వ స్తాయా? అన్నది అనుమానమే. ఏపీని అడ్డుకునేది ఎలా? అని ఇంజినీర్లు ప్రశ్నిస్తున్నారు.
నికర జలాలను కోల్పోవాల్సిన ప్రమాదం
ఆపరేషన్ ప్రొటోకాల్ ముసాయిదా ప్రతిపాదనలతో తెలంగాణ 45 టీఎంసీల నికర జలాలను కోల్పోవాల్సి వస్తున్నది. బచావత్ ట్రిబ్యునల్ అవా ర్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు మళ్లిస్తే, సాగర్ ఆయకట్టు నీటి లో 80 టీఎంసీలను నిలిపివేయాల్సి ఉంటుంది. ఆ మొత్తం నీళ్లను కృష్ణా బేసిన్ రాష్ర్టాలైన నాటి ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీంఎంసీల వాటాను కేటాయించాలి.
ఉమ్మడి ఏపీకి సంబంధించి ఆ నీటిని సాగర్ ప్రాజెక్టున ఎగువన మాత్రమే, అదీ ఇన్బేసిన్ ప్రాజెక్టులకే వినియోగించుకోవాలని ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పింది. తెలంగాణ తన నీటి వాటా 45 టీఎంసీలతోపాటు, మైనర్ ఇరిగేషన్లో మిగులుతున్న మరో 45 టీఎంసీలను మొత్తంగా 90 టీఎంసీలను పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించింది. ప్రస్తుతం ఆపరేషన్ ప్రొటోకాల్లో ఆ 45 టీఎంసీలను క్యారీఓవర్ కింద ప్రతిపాదించారు. రేపు అదే జరిగితే కేటాయించిన నికర జలాలను తెలంగాణ కోల్పోవాల్సి వస్తుందని నీటిరంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
జలవిద్యుత్తుపై ఆశలు వదులుకోవాల్సిందే
తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, అవసరాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్టులు అత్యవసరం. 100 శాతం స్థాపిత సామర్థ్యం మేరకు జలవిద్యుత్తు చేపట్టాలని గత ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ణయించడంతోపాటు జీవోను కూడా విడుదల చేసింది. బోర్డు చేతికి ప్రాజెక్టులు పోతే ఇప్పుడు తెలంగాణకు ఆ అవకాశం ఉండదు. 854 ఫీట్లపైన జలాలు ఉంటేనే, అదీ బోర్డు అనుమతిస్తేనే వి ద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇది తెలంగాణకు తీవ్ర నష్టం చేకూర్చుతుంది. ఉత్పత్తి చేసిన విద్యుత్తును 50:50 నిష్పత్తిలో ఏపీతో పంచుకోవాల్సిన దుస్థితి ఏర్పడనున్నది. ఈ మేరకు ఆపరేషన్ ప్రొటోకాల్లో సీడబ్ల్యూసీ ప్రతిపాదనలను పొందుపరిచింది.
ఏం జరిగింది?
మన నీళ్లు మనకు ఉంటయని సంబురపడ్డం..
మన కరెంటు మనకే వస్తదని సంతోషపడ్డం..
కానీ, కష్టపడి తెచ్చుకున్న నీళ్లు..కృష్ణార్పణం
విద్యుదుత్పత్తికి విఘాతంతో.. అంధకారం
తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు
కాంగ్రెస్ సర్కారు మోసానికిదే తొలిమెట్టు!!
ఏం జరుగుతున్నది..?
ఏపీకి వంతపాడేలా కేఆర్ఎంబీ ప్రొటోకాల్..
ట్రిబ్యునల్కు విరుద్ధంగా రూల్ కర్వ్..
తెలంగాణకు శాపాలుగా నిబంధనలు..
ఏం జరుగబోతున్నది..?
విద్యుత్తు ఉత్పత్తి తగ్గిపోతది.. జలాలు మళ్లిపోతయ్.. ఆయకట్టు ఎండిపోతది..
అన్నపూర్ణ తెలంగాణ.. ఆకలి కేకలేస్తది!