నిజామాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/అడ్డగుట్ట/ఉప్పల్: నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ దాచేపల్లి రవీందర్ గుప్తా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కారు. పరీక్ష కేంద్రానికి అనుమతి ఇచ్చేందుకు రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. హైదరాబాద్లోని తార్నాకలోని నివాసంలోనే ఏసీబీ వల పన్ని రవీందర్ గుప్తాను అదుపులోకి తీసుకున్నది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన దాసరి శంకర్.. శ్రీ షిర్డీ సాయి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు. ఆయన డిగ్రీ కళాశాలకు పరీక్షా కేంద్రాన్ని మంజూరు చేయడం కోసం వీసీ డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుడు ఈ నెల 14న ఏసీబీని ఆశ్రయించారు. శనివారం తార్నాకలో రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వీసీని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. దాదాపు 8 గంటలపాటు వీసీ ఇంట్లో సోదాలను జరిపి, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొన్నారు. వర్సిటీలోని వీసీ చాంబర్లో నూ సోదాలు చేశారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిందితుడిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. వైద్యపరీక్షల నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. రవీందర్కు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో వీసీని చంచల్గూడ జైలుకు తరలించా రు. రాష్ట్ర చరిత్రలో ఒక వర్సిటీ వీసీ ఏకంగా లంచం కేసులో పట్టుబడడం ఇదే ప్రథమమని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అవినీతి, అక్రమాలపై ఏసీబీకి వీసీపై అనేక ఫిర్యాదులు అందాయి. రెండుసార్లు వర్సిటీలో ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సోదాలు సైతం చేశాయి. వీసీ వివాదాస్పద నిర్ణయాలు, అక్రమ నియామకాలు, కోట్ల నిధుల ఖర్చు, పదోన్నతుల్లో, బదిలీల్లో అవినీతిపై విచారణ జరుగుతున్నది.
వీసీ రవీందర్ వ్యవహారంపై ఏసీబీ సోదా లు నిర్వహించగా విస్త్తుగొల్పే అంశాలు వెలు గు చూసినట్టు సమాచారం. టీయూలో వసూ లు చేసిన అక్రమ సొమ్మునంతా రియల్ వ్యాపారంలోకి మళ్లించినట్టు తెలిసింది. స్థలాలు, వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇందులో కొందరు ప్రొఫెసర్లకు వాటాలు ఉన్నట్టుగా ఏసీబీకి పత్రాలు లభించినట్టు తెలిసింది. ఏసీబీకి వీసీ చిక్కడంతో వర్సిటీలో విద్యార్థులు సంబురాలు చేసుకుంటున్నారు. వర్సిటీలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది సైతం సంతోషం వ్యక్తంచేశారు. వీసీకి అంటకాగిన ప్రొఫెసర్లను, బోధనేతర సిబ్బంది పాత్రను సైతం నిగ్గుతేల్చాలంటూ ఏసీబీకి లేఖలు రాసేందుకు పలువురు ప్రొఫెసర్లు సిద్ధమయ్యారు. యూనివర్సిటీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని వారంతా
కోరుకుంటున్నారు.
టీయూ వీసీగా రవీందర్ గుప్తా 2021 మే 22న నియమితులయ్యారు. రెండేండ్లలోనే ఆయన చేయని అక్రమాలంటూ లేవని వర్సిటీ వర్గాలు చెప్తున్నాయి. ప్రతి పనికి పైసా, ఫైలు కదలాలంటే పైకం.. చివరికి పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్ ఇవ్వాలన్నా స్వీట్ బాక్సులు, బిర్యానీ విందు తప్పనిసరనే ఆరోపణలు ఉన్నాయి. వర్సిటీలో ఇష్టానుసారంగా అర్హత లేని వారికి పదోన్నతులు, అంతర్గతంగా వర్సిటీలో ఆయా బోర్డులకు ఇన్చార్జీల నియామకం, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన వందలాది మందిని నియమించుకోవడం ద్వారా రూ.కోట్లు దండుకున్నారని తెలిసింది. 25 నెలల కాలంలో వీసీ హోదాలో రవీందర్ గుప్తా ఏకంగా ఆరుగురు ప్రొఫెసర్లను 10 సార్లు రిజిస్ట్రార్లుగా మార్చి గందరగోళం సృష్టించారు. పాలకవర్గం వద్దని తీర్మానించిన వ్యక్తులకు ఆర్డర్ కాపీ ఇస్తూ ఒంటెద్దు పోకడలతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ప్రభుత్వం నియమించిన పాలకవర్గ సభ్యులను బెదిరించడం, వారికి లేఖలు రాస్తూ బ్లాక్ మెయిలింగ్కు సైతం వీసీ పాల్పడ్డారు. ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి వందలాది మందిని ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో నియమించిన వ్యవహారంపై తనకే సర్వాధికారాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తనపై అజమాయిషీ చేయడం ఏంటంటూ ప్రశ్నించారు. పాలకవర్గాన్ని లెక్క చేయకపోగా, హైకోర్టు మెట్లెక్కి నానా యాగి చేద్దామని ప్రయత్నించి బొక్క బోర్లా పడ్డారు. టీయూలో ఆర్థిక వ్యవహారాలకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికే హక్కులుంటాయని ఉన్నత న్యాయస్థానం పేర్కొనడంతో వీసీ దిగొచ్చారు. అప్పటి వరకు పాలకవర్గంతో ఢీ అంటే ఢీ అంటూ కొట్లాడిన వీసీ జూన్ 16న ఈసీ నియమించిన రిజిస్ట్రార్నే తిరిగి నియమిస్తూ వీసీ ఉత్తర్వులు జారీ చేశారు. తెల్లారే లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.
ప్రభుత్వ ఆదేశాలు, పాలకవర్గ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ప్రొఫెసర్ విద్యావర్ధిని, ప్రొఫెసర్ కనకయ్యను సస్పెండ్ చేస్తూ 61వ టీయూ పాలకవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. గతంలోనే వీరిపై క్రమశిక్షణ చర్యలకు పాలకవర్గం సిఫార్సు చేసింది. కానీ, వీసీ రవీందర్ గుప్తా ఈ నిర్ణయాలకు అడ్డుపుల్ల వేశారు. హైదరాబాద్ రూసా బిల్డింగ్లో శనివారం కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ చైర్మన్గా ఈసీ మీటింగ్ జరిగింది. ఏసీబీకి చిక్కిన వీసీ రవీందర్ గుప్తా తీరుపై చర్చించారు. 2022-23లో పీహెచ్డీ అడ్మిషన్లలో జరిగిన అక్రమాలపై ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లతో విచారణ కమిటీ వేయాలని ఈసీ నిర్ణయించింది.