హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధన కోసం మరింత విరివిగా యంత్రాలను వినియోగించాలని, వాటి పని గంటలను 14 నుంచి 18కి పెంచాలని సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం, సత్యనారాయణరావు ఏరియాల జీఎంలను ఆదేశించారు. శుక్రవారం వారు హైదరాబాద్లోని సింగరేణి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కంపెనీ యంత్రాలు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల పనితీరును సమీక్షించారు. సింగరేణిలోని షావెల్స్ ద్వారా రోజూ 2 లక్షల క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా ఓవర్ బర్డెన్ను తొలగించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. బ్రేక్డౌన్లను తగ్గించుకోవాలని, యంత్రాల విడిభాగాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
లారీల యాజమానులతో భేటీ
అనంతరం లారీ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలతో సింగరేణి డైరెక్టర్లు సమావేశమయ్యారు. నిరాటంకంగా బొగ్గును సరఫరా చేసేందుకు గనుల వద్ద లారీలను అందుబాటులో ఉంచాలని, రవాణాకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని కోరారు. డీజిల్ ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా రవాణా చార్జీలను చెల్లించేలా ఫార్ములాను మార్చామని, ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాల సమస్యలను పరిష్కరించామని వివరించారు. దీంతో బొగ్గు రవాణాకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని లారీ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలు హామీ ఇచ్చాయి. సమావేశంలో సింగరేణి జీఎంలు నాగభూషణ్రెడ్డి, సత్తయ్య, స్వామినాయుడు, సురేందర్ పాల్గొన్నారు.