హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల భర్తీ కోలాహలం మొదలైంది. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్ఠానం దృష్టి పెట్టింది. పదేండ్లుగా అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ, పార్టీ కోసం పనిచేసిన నేతలకు సం క్రాంతి కానుకగా నామినెటెడ్ పోస్టులు ఇవ్వాలని భావిస్తున్నది.
గాంధీభవన్లో జరిగిన పార్టీ పీఏసీ మీటింగ్లో నెలలోగా పదవులు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ కూడా చెప్పడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో 54 కార్పొరేషన్ల చైర్మన్లు, ఆరు ఎమ్మెల్సీలు, మరో ఆరు మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉన్నది. ఎమ్మె ల్సీ పదవుల కోసం సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, మధుయాష్కీగౌడ్, జగ్గారెడ్డి వంటి వారు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఎమ్మెల్యే టికెట్ దక్కని అద్దంకి దయాకర్ వంటి నేతలకు అధిష్ఠానం ఎమ్మె ల్సీ హామీ ఇచ్చింది. దీంతో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ తీవ్రంగా నెలకొన్నది.
ఈ నేపథ్యంలో జిల్లాస్థాయి నేతలు కార్పొరేషన్ చైర్మన్ పదవులపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో 54 కార్పొరేషన్ల చైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం పోటీ పడుతున్నవారి సంఖ్య అంతకంటే ఎక్కువగా ఉన్నది. ఆయా పదవులపై గురిపెట్టిన పలువురు నేతలు ఇటు రాష్ట్ర నాయకత్వం, అటు ఢిల్లీ అధిష్ఠానం వద్ద పైరవీలు షురూ చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్రెడ్డిని కలిసేందుకు నానా తంటాలు పడుతున్నారు. సోమవారం గాంధీభవన్కు వచ్చిన ఆయనను కలిసేందుకు భారీగా నేతలు తరలిరావడం గమనార్హం. రేవంత్రెడ్డి ప్రభుత్వ పనులు, సమీక్షల్లో బిజీగా ఉండటంతో ఆయనను కలవడం కష్టంగా మారిందని పార్టీ నేతలు చెప్తున్నారు.
వారికే ప్రాధాన్యమా?
పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ ఏండ్లుగా పార్టీనే అంటిపెట్టుకొని పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన నేతలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. పైరవీలకు తావులేకుండా పార్టీ కోసం, ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారికి మాత్రమే ఇవ్వాలనేది అధిష్ఠానం ఉద్దేశమని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. పార్టీలోనే ఉంటూ పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన వారిని, ఎన్నికల సమయంలో పార్టీ మారే ఆలోచన చేసిన వారిని పక్కన పెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ అంశాల ప్రాతిపదికగా జాబితా సిద్ధం చేయాలని పార్టీలోని పలువురు కీలక నేతలకు రేవంత్రెడ్డి సూచించినట్టు సమాచారం.