హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): అత్యుత్తమ సాంకేతిక విద్యనందిస్తున్న జేఎన్టీయూహెచ్తో ఒప్పందం (ఎంవోయూ) చేసుకొనేందుకు ఆయా రాష్ర్టాల్లోని యూనివర్సిటీలు ముందుకొస్తున్నాయి. వర్సిటీలో డ్యూయల్ డిగ్రీ కోర్సులను అమలు చేస్తుండటంతో ఒకేసారి బీటెక్తోపాటు బీబీఏ డాటా అనలిటిక్స్ను పూర్తిచేసే అవకాశం ఉన్నది. విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్న ఈ నూతన విధానాన్ని తాము అమలు చేస్తామని లడక్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ప్రదేశ్ల నుంచి మూడు యూనివర్సిటీలు తమ సంసిద్ధతను వ్యక్తం చేసి ఎంవోయూ కుదుర్చుకొనేందుకు సన్నద్ధమయ్యాయి. ఈ ఒప్పందం జరిగితే బీబీఏ డాటా అనలిటిక్స్ కోర్సుకు ఆన్లైన్ పాఠాలను జేఎన్టీయూ ప్రొఫెసర్లే బోధించనున్నారు. ఇదిలా ఉంటే బీబీఏ డాటా అనలిటిక్స్ కోర్సుకు అదనంగా బీబీఏ ఫార్మాస్టూటికల్ మేనేజ్మెంట్ కోర్సుతోపాటు మరో రెండు కోర్సులను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని అధికారులు యోచిస్తున్నారు.
ఒకే విద్యాసంవత్సరంలో రెండు కోర్సులను పూర్తి చేసేందుకు వీలు కల్పిస్తూ జేఎన్టీయూహెచ్ ఈ ఏడాదే డ్యూయల్ డిగ్రీ కోర్సు ప్రవేశపెట్టింది. బీటెక్, బీఫార్మసీ విద్యార్థులు ఒక వైపు రెగ్యులర్ కోర్సు చదువుతూనే మరోవైపు బీబీఏ డాటా అనలిటిక్స్ కోర్సులో చేరే అవకాశం కల్పించారు. వర్సిటీతోపాటు అటానమస్ కాలేజీలు, అనుబంధ కాలేజీల్లోని విద్యార్థులు ఒకేసారి రెండింటిలో చేరేందుకు వీలు కల్పించడంతో 46 కాలేజీలు డ్యూయల్ డిగ్రీ కోర్సులు బోధించేందుకు ముందుకొచ్చాయి. అయితే బీటెక్ 1,2,3 సంవత్సరాల్లోని విద్యార్థులు మాత్రమే ఈ కోర్సులో చేరే అవకాశం ఉన్నది. ఒక్కో కాలేజీలో గరిష్ఠంగా 60, కనిష్ఠంగా 20 సీట్లు ఈ డ్యూయల్ డిగ్రీ కోర్సులకు కేటాయించారు. ప్రస్తుతానికి జేఎన్టీయూ అనుబంధ కాలేజీల్లో మాత్రమే అమలు చేస్తుండగా, వచ్చే ఏడాది ఓయూ పరిధిలో బీబీఏ డాటా అనలిటిక్స్ కోర్సులో చేరే అవకాశం కల్పించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.