అయిజ/జోగులాంబ గద్వాల : కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న మోస్తరు వర్షాలతో తుంగభద్ర డ్యాంకు వరద నిలకడగా కొనసాగుతున్నది. సోమవారం డ్యాంలో ఇన్ఫ్లో 14,697, అవుట్ఫ్లో 12,255 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీటి నిల్వ (100.855 టీఎంసీలు) ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్ తెలిపారు.
అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు 26,330 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా..25,900 క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 10 అడుగుల మేర నీటి మట్టం ఉండగా, ప్రధానకాల్వకు 430 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.