హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారక రామారావు ఆలోచనల్లోంచి వచ్చిన ‘రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్’ అనే ట్రిపుల్ ఆర్ మంత్రం ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకెళ్లింది. ప్రతి శనివారం రీథింకింగ్ డేగా నిర్వహిస్తూ.. పౌరులకు మేలు చేయాలని మంత్రి ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వస్తున్నది.
రీథింకింగ్ డేలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణ స్థానిక సంస్థలలోని మొత్తం 180 సెంటర్ల నుంచి దాదాపు 1.8 టన్నుల రీసైకిల్డ్ వస్తువులను సేకరించినట్టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ తెలిపారు. దుస్తులు, పుస్తకాలు, పాదరక్షలు, ప్లాస్టిక్ వస్తువులు విరివిగా ప్రజల నుంచి సేకరించిట్టు పేర్కొన్నారు. ఈ సేకరించిన వస్తువులను ఆయా ఎన్జీవోల ద్వారా పలు కమ్యూనిటీల్లో అవసరమైన నిరుపేదలకు పంపిణీ చేయనున్నారు.