హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత పర్యాటక శాఖ లాభాలబాట పట్టిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) పేర్కొన్నారు. పర్యాటకులకు మెరుగైన సేవలు అందిస్తూనే 2022-23 సంవత్సరంలో రూ. 117 కోట్ల టర్నోవర్( Turnover) సాధించిందని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం పర్యాటక శాఖ వార్షిక టర్నోవర్ సగటున రూ. 113 కోట్లు కాగా, గడచిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం రూ. నాలుగు కోట్లు అదనంగా టర్నోవర్ సాధించిందని అన్నారు.
బుధవారం హైదరాబాద్లోని హరిత ప్లాజాలో నిర్వహించిన పర్యాటక శాఖ(Tourism) సమీక్షలో మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు(CM KCR) రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ కృషితోనే రామప్ప ఆలయానికి(Ramappa Temple) యునెస్కో గుర్తింపు, భూదాన్ పోచంపల్లి గ్రామం ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైనట్లు గుర్తుచేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో లీజుల పేరుతో పర్యాటక శాఖ ఆస్తులను అనుభవిస్తున్న సంస్థలపై చర్యలు చేపట్టి ఇప్పటివరకూ రూ. 60 కోట్ల బకాయిలు వసూలు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో ఇంకా అనేక చారిత్రక నిర్మాణాలు యునెస్కో(UNESCO) గుర్తింపునకు అర్హత కలిగి ఉన్నాయని, వాటిని గుర్తింపు తెచ్చేందుకు కృషిచేస్తామన్నారు. రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్శించేందుకు టూరిజం ప్రమోషన్(Tourism Promotions) కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
తిరుపతి, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లోనూ తెలంగాణ టూరిజం వసతిగృహాలు
రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను పరిరక్షించడంతోపాటు తిరుపతి, విశాఖపట్నం, వారణాసి తదితర ప్రాంతాల్లో కూడా తెలంగాణ టూరిజం తరఫున వసతిగృహాలు, హోటళ్లు నిర్మించేందుకు కృషిచేస్తున్నామన్నారు. దేశంలోనే బెస్ట్ టూరిజం ప్రాంతంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు శ్రీనివాస్ గౌడ్ వివరించారు. ఈ సమీక్షలో సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎండీ మనోహర్తోపాటు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.