JEE Mains | హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో భాగంగా శనివారం నిర్వహించిన పేపర్-1 (బీఈ/బీటెక్)లో వచ్చిన మొత్తం ప్రశ్నల్లో 8 ప్రశ్నలు చాలా కీలకం కానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొదటిరోజు పేపరులో ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చినట్టు చెబుతున్నారు. 8 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారు కచ్చితంగా మొత్తంగా 300 మార్కులు తెచ్చుకునే వీలుందని తేల్చి చెప్తున్నారు.
పేపర్-1 పరీక్షలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో విద్యార్థులకు అర్థమయ్యే ప్రశ్నలే అడిగారని, డిలీట్ చేసిన సిలబస్ నుంచి ప్రశ్నలు రాకుండా జాగ్రత్తపడ్డారని చెప్తున్నారు. టాపర్లు 300కు 300 మార్కులు సాధించే అవకాశం ఉన్నట్టు శ్రీచైతన్య జూనియర్ కళాశాలల ఆలిండియా ఐఐటీ కోఆర్డినేటర్ ఉమాశంకర్ అభిప్రాయపడ్డారు. మొదటి షిప్ట్తో పోల్చితే రెండో షిఫ్టులో విద్యార్థులు సుధీర్ఘ సమయం తీసుకుంటారేమోనని తెలిపారు.