Bhopal | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంపై ఉగ్ర దాడులకు బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లోనే పథక రచన జరిగింది. మధ్యప్రదేశ్లోని భోపాల్ కేంద్రంగా తెలంగాణలో ఉగ్ర కుట్రలు జరిగాయి. చాపకింద నీరులా ఉగ్రమూలాలు విస్తరించే క్రమంలోనే తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ సంయుక్తంగా టార్గెట్ను పూర్తిచేశాయి. సమాజంలో మంచి వ్యక్తుల్లా నటిస్తూ, దొంగచాటుగా జిహాద్ పాఠాలు బోధించాలని ప్రయత్నించిన వారి ఆట కట్టించాయి. పోలీసులు మంగళ, బుధవారాల్లో అరెస్టు చేసిన 17 మందిలో 12 మంది మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన వారే.
ఆ బృందానికి హెడ్గా ఉన్న మహ్మద్ సలీం మధ్యప్రదేశ్ వాసి. క్లౌడ్ ఇంజినీర్గా పనిచేస్తున్న అబ్దుల్ రెహ్మాన్ ఒడిశాకు చెందిన వ్యక్తి. వీరితో పాటు అరెస్టయిన నలుగురు హైదరాబాద్కు చెందినవారు. వీరిలో ఒకతను డెంటిస్టు కాగా.. మిగిలిన ముగ్గురు సాధారణ కూలీలు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న హిజ్బ్ ఉత్ తహ్రీర్కు చెందిన ఇస్లామిస్ట్లను అరెస్టు చేయడంతో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ కీలకంగా వ్యవహరించింది.
రాష్ట్ర నిఘా సంస్థలు అప్రమత్తంగా లేకుంటే..
రాష్ట్ర ప్రజల భద్రతే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర నిఘా సంస్థలు అప్రమత్తంగా లేకపోతే పరిస్థితి ఇంకోలా ఉండేదేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆరోపణలు గుప్పిస్తున్న బీజేపీ నేతలు, ఆ పార్టీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లోనే అత్యంత ప్రమాదకరమైన ‘హిజ్బ్ ఉత్ తహ్రీర్’కు ఎలా చోటిచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతమంది ఉగ్రవాదులు చాపకింద నీరులా విస్తరిస్తూ ఉంటే.. కేంద్ర నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయని నిలదీస్తున్నారు. హైదరాబాద్లో చిచ్చుపెట్టాలని చూసింది మధ్యప్రదేశ్లో పురుడుపోసుకున్న ఉగ్రవాదులే కదా! అంటూ బీజేపీ నేతల తీరును ఎండగడుతున్నారు.
అనంతగిరిలో టెర్రరిస్టు శిక్షణ అవాస్తవం: ఎస్పీ కోటిరెడ్డి
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అడవుల్లో కొందరు టెర్రరిస్టులకు శిక్షణ ఇస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తప్పుడు సమాచారంతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించొద్దని హితవు పలికారు.