హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం వచ్చే నెల 1తో ముగియనున్నది. ఈలోగా ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఎలాంటి సన్నాహాలూ, ఏర్పాట్లు ప్రారంభించలేదు. దీంతో పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తారా? ఇప్పుడున్న సర్పంచ్లనే పర్సన్ ఇన్చార్జీలుగా నియమిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే బీసీ గణనను తప్పనిసరిగా చేసి వారికి రిజర్వేషన్లు కేటాయించాలని గత ఎన్నికల సమయంలోనే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
బీసీ గణనకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కదలిక లేదు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ గణన చేసి ఆ లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు, పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అప్పగించాల్సి ఉంటుంది. ఇవన్నీ వచ్చే నెల 1 నాటికి పూర్తిచేయడం అసాధ్యం. దీంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన అమలు చేయడం లేదా సర్పంచ్లను పర్సన్ ఇన్చార్జీలుగా నియమించడం తప్పనిసరి కానున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదు. ఒకవేళ పర్సన్ ఇన్చార్జీలను కాకుండా స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తే.. మండలంలోని గెజిటెడ్ అధికారులకు ఆ బాధ్యతలు అప్పగిస్తారు.
యూపీ, ఎంపీలో…
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లోనూ పంచాయతీల గడువు ముగిసినా బీసీ గణన చేయకపోవడంతో ఎన్నికల నిర్వహణపై అక్కడ కొందరు కోర్టులను ఆశ్రయించారు. బీసీ గణన చేయకుంటే ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే సీట్లు కాకుండా ఇతర సీట్లన్నింటిని జనరల్ సీట్లుగా పరిగణించి ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో బీసీల నుంచి తీవ్ర ఆగ్రహం రావడంతో ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బీసీ గణన చేపట్టి ఎన్నికలు నిర్వహించాయి.
గతంలో సర్పంచ్లను పర్సన్ ఇన్చార్జీలుగా నియమించిన సందర్భాలు..