హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించిన సమ్మక్క బరాజ్ను సందర్శించాలని ఛత్తీస్గఢ్ రాష్ర్టానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ శనివారం ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. సమ్మక్క బరాజ్ డీపీఆర్కు అనుమతులు ఇవ్వరాదని సీడబ్ల్యూసీకి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఫిర్యాదులు చేస్తుండటం, ముంపుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో ఈ లేఖ రాశారు. ముంపు సమస్యకు తావులేకుండా బరాజ్ను నిర్మించామని తెలిపారు. ఒక వేళ ముంపు సంభవిస్తే బరాజ్లో నీటి నిల్వను తగ్గించుకొంటామని ఆ లేఖలో హామీ ఇచ్చారు.
చనాకా కొరాట, చిన్న కాళేశ్వరం (ముక్తీశ్వరం), చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకాల డీపీఆర్లకు అనుమతులు ఇచ్చేందుకు సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) సమావేశాన్ని నిర్వహించాలని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ శనివారం కేంద్ర జల్శక్తి శాఖకు మరో లేఖ రాశారు. ఈ డీపీఆర్లకు సంబంధించిన సాంకేతిక అంశాల పరిశీలన ప్రక్రియ ఏప్రిల్ 27న జరిగిన జీఆర్ఎంబీ సమావేశంలోనే ముగియడంతో టీఏసీ అనుమతి కోసం కేంద్ర జలశక్తిశాఖకు పంపారు. నాటి నుంచి అవి అక్కడే పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే త్వరగా టీఏసీ సమావేశం ఏర్పాటుచేసి డీపీఆర్లకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర జల్శక్తిశాఖ కార్యదర్శి పంకజ్కుమార్ను కోరుతూ తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.