హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): మాతాశిశు సంరక్షణ సేవల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తున్నది. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టిపెట్టారు. కేసీఆర్ కిట్లు, అమ్మఒడి వాహనాల వంటి పథకాలను ప్రవేశపెట్టారు. దీనికితోడు ఏఎన్సీ చెకప్ల విషయంలో పటిష్టమైన కార్యాచరణ రూపొందించారు. ఆరోగ్యలక్ష్మి పేరుతో గర్భిణులకు పోషకాహారం అందించారు. ఈ చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయి.
ముఖ్యంగా కేసీఆర్ కిట్ బంపర్ హిట్ అయ్యింది. సీఎం కేసీఆర్ ఏ పథకాన్ని.. కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా దానివల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ఒక సమస్యను పరిష్కరించాలని భావించినప్పుడు.. దానిని లోతుగా అధ్యయనం చేసి, దాన్ని పరిష్కరించే మార్గంపై సుదీర్ఘంగా మేధోమథనం చేసి, దానివల్ల ఏయే ఫలితాలు రాబట్టవచ్చో అన్నికోణాల్లో ముందుగానే ఊహించిన తర్వాతే దాని అమలుకు కార్యాచరణ ప్రారంభిస్తారు. అందుకే ఆయా పథకాలు సామాజికంగా అనేక కోణాల్లో ప్రజలకు లాభాలు కల్పిస్తున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.. కేసీఆర్ కిట్. గర్భిణులు, బాలింతల సంక్షేమమే లక్ష్యంగా ఈ పథకాన్ని 2017 జూన్ 2 నుంచి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది.
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం చేయించుకునే మహిళలకు తగిన ఆర్థిక సహాయం అందించడంతోపాటు, తల్లీబిడ్డలకు అవసరమైన వస్తువులను ఉచితంగా అందిస్తున్నారు. తల్లులకు మూడు విడతలుగా మొత్తం రూ.12 వేల రూపాయలను ప్రభుత్వం అందిస్తున్నది. వారు ఆడపిల్లలకు జన్మనిస్తే ప్రోత్సాహకంగా మరో 1000 రూపాయలు కలిపి 13 వేల రూపాయలను ప్రభుత్వం ఇస్తున్నది. ఇప్పటివరకు 13,90,636 మందికి కిట్లతోపాటు, ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించింది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.1261 కోట్లను ఖర్చు చేసింది.
గర్భిణులు సురక్షితంగా ఇంటి నుంచి దవాఖానలకు వెళ్లి, పరీక్షలు చేయించుకొని తిరిగి రావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అమ్మఒడి వాహనాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం 300 వాహనాలు ఉన్నాయి. ఇవి రోజూ వేలాదిమంది గర్భిణులను సురక్షితంగా ప్రయాణించేలా చేయడమే కాకుండా.. వారికి రవాణా ఖర్చును తగ్గిస్తున్నాయి. సురక్షితమైన డెలివరీలకు కూడా ఈ పథకం బాటలు వేస్తున్నది. దీని ద్వారా ఇప్పటివరకు 18,46,635 మంది ప్రయోజనం పొందారు. ప్రభుత్వం రూ. 172.08 కోట్లు ఖర్చు చేసింది.
గర్భిణులకు, బాలింతలకు పోషకాహారం అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు, బాలింతలకు వేడిగా అప్పుడే వండిన పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. నెలలో కనీసం 25 రోజులపాటు అన్నం, పప్పు (పప్పు, ఆకు కూరలు, కూరగాయలతో సాంబార్), ఉడికించిన గుడ్డు అందజేస్తున్నారు. 2014 నుండి ఇప్పటివరకు ఆరోగ్య లక్ష్మి పథకం కింద 36,26,603 మంది మహిళలు లబ్ధి పొందారు. రోజువారీ హాజరును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ‘ఆరోగ్యలక్ష్మి’ అనే యాప్ను రూపొందించింది. వారికి ఆహారం అందిచడమే కాకుండా, వారి ఆరోగ్య పరిస్థితిని ఈ యాప్ ద్వారా ట్రాక్ చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి కేవలం 56 శాతం అంగన్ వాడీ కేంద్రాల్లో మాత్రమే పౌష్టికాహారం ఇచ్చేవారు. ఇప్పుడు ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా నూటికి నూరుశాతం అంగన్ వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్లతో కూడిన పౌష్టికాహారాన్ని గర్భిణులకు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్నది. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం అమలుచేస్తున్న ఆరోగ్యలక్ష్మీ పథకం అమలుతీరును నీతి ఆయోగ్ ప్రశంసించింది.
సిజేరియన్లను తగ్గించి, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఇందుకోసం నార్మల్ డెలివరీల వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేసింది. మంత్రి హరీశ్రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రైవేట్ దవాఖానల యజమానులు, పూజారులు, అధికారులు.. ఇలా వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించి సాధారణ ప్రసవాల ఆవశ్యకతను వివరించారు. కనిపించిన ప్రతి వేదికపై ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు అనవసర సిజేరియన్లను తగ్గించేందుకు ప్రభుత్వం కొత్తగా టీమ్ బేస్డ్ ఇన్సెంటివ్ను ప్రారంభించింది. గతంలో సీ-సెక్షన్లు చేస్తే ఇన్సెంటివ్ ఇచ్చే విధానం ఉండగా.. దాన్ని రద్దు చేసి సాధారణ డెలివరీలు చేసిన వైద్య సిబ్బందికి రూ.3000 ప్రోత్సాహం అందిస్తున్నది. 2022 ఆగస్టు నుంచి ఇది అమలవుతున్నది.
మాతా శిశు సంరక్షణకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం.. గర్భిణుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నియంత్రించేందుకు మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టింది. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం రూ. 50 కోట్లతో గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూపకల్పన చేసింది. అత్యధికంగా ఎనీమియా (రక్త హీనత) ప్రభావం ఉన్న 9 జిల్లాల్లో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 2022 డిసెంబర్ 21 నుంచి ఈ పథకం ప్రారంభమైంది. 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ల్లో ఈ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది.