హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 10న లక్ష మంది ఉద్యోగులతో హైదరాబాద్ను దిగ్బంధం చేస్తామని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ హెచ్చరించింది. ‘చలో హైదరాబాద్’లో భాగంగా హైదరాబాద్ను ముట్టడిస్తామని ప్రకటించింది. ప్రభుత్వం దిగి వచ్చేవరకు పోరాటం తప్పదని అల్టిమేటం జారీ చేసింది. సీపీఎస్ను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తో జేఏసీ మంగళవారం ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ సర్కార్పై సమర శంఖం పూరించిన ఉద్యోగులు నిరసనలు హోరెత్తించారు. రాష్ట్రంలోని మండల, డివిజన్, జిల్లా కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు, జెండాలతో ఆందోళనకు దిగారు. హైదరాబాద్లోని గగన్విహార్, బీమాభవన్, హైదరాబాద్ కలెక్టరేట్, అర్ధ గణాంకశాఖ కార్యాలయాల ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆందోళనకు దిగారు. నిరసనల్లో ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేని(ముజీబ్), టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధానకార్యదర్శి బీ శ్యామ్, ముత్యాల సత్యనారాయణగౌడ్, కట్కూరి శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, సదానందంగౌడ్, ఎంబీ కృష్ణాయాదవ్, విక్రమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మూడేైండ్లెనా పీఆర్సీ రాకపోవడం, ఆరు డీఏలు పెండింగ్లో ఉండటం యావత్తు ఉద్యోగుల్లో ఆందోళన నెలకొన్నదని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ వాపోయారు. రాష్ట్రంలో ఉద్యోగుల మీద ఏసీబీ దాడులు జరుగుతున్నాయని.. ఇదే తరహాలో రాజకీయ నాయకుల మీద ఏసీబీ దాడులు జరుగవా..? అంటూ ప్రశ్నించారు. ప్రతి వ్యవస్థలో ఐదా రు శాతం తప్పు చేసేవారుంటారు.. కానీ ఉద్యోగులందరిని అవినీతిపరులుగా చూపించే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ఐదేండ్లు పనిచేసిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు జీవితకాలం పింఛన్ వస్తుందని.. కానీ లక్షల మందితో పోటీ పరీక్షల్లో నెగ్గి.. ఉద్యోగం దక్కించుకున్న ఉద్యోగులకు పింఛన్ ఎందుకు రాదని మారం ప్రశ్నించారు.
ఉద్యోగుల డిమాండ్లకు పరిష్కారం చూపాల్సింది పోయి భయభ్రాంతులకు గురిచేస్తే ఎట్లా అని టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేనీ (ముజీబ్) ప్రశ్నించారు. జేఏసీ నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరుపాల్సింది పోయి.. భయభ్రాంతులకు గురిచేయడంపై విస్మయం వ్యక్తంచేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): సీపీఎస్ను వెంటనే రద్దుచేసి, ఓపీఎస్ను పునరుద్ధరణ చేసుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి పేరొన్నారు. సీపీఎస్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల జీతాలు, జీవితాలు, భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నదని వాపోయారు. సెప్టెంబర్ 1న సీపీఎస్ విద్రోహ దినంగా పాటిస్తూ మంగళవారం హైదరాబాద్లోని సీసీఎల్ఏ ప్రాంగణంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ… తమ పోరాటం జీతం, ఉద్యోన్నతుల కోసం మాత్రమే కాదని, తమ ఆత్మగౌరవం కోసం జరుగుతున్నదని గుర్తుచేశారు. 2004 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ సీమ్(సీపీఎస్) కారణంగా ఉద్యోగి ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్కు భరోసాలేదని వాపోయారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో హామీ ప్రకారం సీపీఎస్ను రద్దు చేయాల్సిందేనని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ స్పష్టంచేశారు. పాత పింఛన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విద్రోహ దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు, నల్ల రిబ్బన్లు ధరించి, ప్లకార్డులు చేతబట్టి మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలు తెలిపారు. సీపీఎస్ రద్దుపై నవంబర్ 17లోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. లేదంటే నవంబర్ 17న 2.68లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులమంతా సామూహిక సెలవు పెడుతామని హెచ్చరించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్గౌడ్ పాల్గొన్నారు.