హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ఉద్యమకాలం నాటి ఐక్యత లోపించడం వల్లనే నేడు రాష్ట్ర ప్రయోజనాలకు గండి పడే పరిస్థితు లు వచ్చాయని సామాజిక, రాజకీయ విశ్లేషకురాలు ప్రొఫెసర్ దంటు కనకదుర్గ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసిన స్థానిక పార్టీని విస్మరించడమే అసలు కారణమని చెప్పారు. నేడు రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిదంటే కారణం.. గత ఎన్నికల్లో కొన్ని వర్గాలు చేసిన తప్పిదమేనని విశ్లేషించారు. హైదరాబాద్లో శనివారం జరిగిన ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ప్రసంగించారు. రాష్ట్ర అస్తిత్వానికి రక్షణ గోడలా నిలిచిన వ్యక్తిని విమర్శించి, కాంగ్రెస్కు పట్టం కట్టడంతోనే అసలు సమస్య వచ్చిందని అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తెలంగాణ ప్రాంతానికి ఏనాడూ న్యాయం చేయలేదని, చరిత్ర చెప్తున్న ఎన్నో కమిషన్ల ని వేదికలు, రిపోర్టులతోనే తేటతె ల్లం అవుతున్నదని తెలిపారు.
నిజాం కాలంలో సర్ప్లస్ నిధుల తో సుభిక్షంగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రా పాలకుల పె త్తనమే దివాలా తీసేలా చేసిందని చెప్పారు. మద్రాస్ నుంచి విడిపోయి, రూ.22 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్ర రాష్ట్ర పాలకులు తెలంగాణ సంపదను దోచుకుతిన్నట్టు ఎన్నో నివేదికలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. పోనీ ఆంధ్రా పాలకులకు, సినీ నటులకు, వ్యాపారులకు తమ ప్రాంతంపై అభిమానం ఉన్నదా? అంటే అదీ లేదని గుర్తించలేని స్థితిలో అక్కడి ప్రజలు ఉన్నారని ఆమె ఆ వేదన వ్యక్తంచేశారు.
నిజంగా వారికి తమ ప్రాంతంపై అభిమానమే ఉంటే.. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉండే బదులు.. తమ ప్రాంతంలో ఎందు కు పరిశ్రమలు నెలకొల్పలేదని, విద్యా సంస్థలు, దవాఖానలను కట్టించలేదని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ర్టాల మధ్య ఉన్న రాజకీయ సమతుల్యత, ప్రయోజనాలు, మారుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే.. తొలి ప్రభుత్వమే మేలనే భావన కలుగుతున్నదని అన్నారు. ఒక స్పష్టమైన విజన్తో పాలన సాగిందనీ, కానీ ఇప్పుడు కక్ష సాధింపులు, మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు.
తెలంగాణను నాడు ఆంధ్రా ప్రాంతంతో కలిపినప్పుడు ఇక్కడి ప్రయోజనాల కోసం కొట్లాడిన రాజకీయ నాయకులు కొందరు ఉండేవారని కనకరదుర్గ గుర్తుచేశారు. కానీ ప్రస్తుత రాజకీయాలు స్వరాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసి, మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకుల కొమ్ము కాస్తున్నట్టుగా ఉన్నాయని ఆరోపించారు. గిర్గ్లానీ, ఫజల్ అలీ కమిషన్ల వరకు తెలంగాణ ప్రాంతంపై ఆంధ్రా పాలకులు చూపిన వివక్షను, చివరకు శ్రీకృష్ణ కమిటీ ముందు కూడా ప్రొఫెసర్ జయశంకర్ సమగ్రంగా, గణాంకాలతో చెప్పిన నివేదిక వరకు తెలంగాణకు జరిగిన నష్టాన్ని వివరించాయని తెలిపారు.
వచ్చే రెండున్నరేండ్ల తర్వాతనైనా అస్తిత్వానికి ప్రాధాన్యమిచ్చే స్థానిక నాయకత్వాన్ని గెలిపించుకోవాలని, లేదంటే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందనే విషయాన్ని తెలంగాణ ప్రజానీకం గుర్తించాలని చెప్పారు.