కాశీబుగ్గ, జూన్ 13: ఓ కీచక బాబా చీకటి బాగోతాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం బట్టబయలు చేశారు. దేవుడిపై ఉన్న భక్తి, నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని దొంగ బాబాలు అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టాస్క్ఫోర్స్ ఏసీపీ ఎం జితేందర్రెడ్డి తెలిపారు. తమిళనాడుకు చెందిన షైక్నాలా లబ్బే(58) 40 ఏండ్ల క్రితం తెలంగాణకు వచ్చి గ్రేటర్ వరంగల్ జిల్లాలోని ఎనుమాముల ప్రాంతంలో స్థిరపడ్డాడు.
బాబా అవతారమెత్తి.. తన మంత్ర శక్తులతో కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆరోగ్య సమస్యలుంటే పరిష్కరిస్తానని నమ్మించి పలువురు మహిళలు, యువతులను లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో ఓ వివాహితపై కన్నేసిన దొంగబాబా ఆమెకు తన భర్తతో ఉన్న విభేదాలను దృష్టిలో ఉంచుకొని, పూజలు చేస్తున్నట్టు నటించి ఆమెపై లైంగికదాడి చేశాడు. భయపడిపోయిన ఆమె అసలు విషయం ఇంట్లో చెప్పింది. బాధితురాలిని వెంటబెట్టుకుని కుటుంబ సభ్యులు టాస్క్ఫోర్స్ పోలీసులను ఆశ్రయించడంతో కీచక బాబా చీకటి వ్యవహారం బయటపడింది.