హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): శాసనసభ, శాసనమండలి సమావేశాలు అర్థవంతంగా, ప్రశాంతంగా జరిగాయని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సభ తక్కువ రోజులు జరిగినా ఎక్కువ గంటలు నడిచిందనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. మంగళవారం ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడిన అనంతరం ఆయన ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. సభలో ప్రతిపక్షాలకు ఎకువ సమయమే ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్కు ఆరుగురు సభ్యులున్నా ముగ్గురు మాత్రమే సభలో ఉండేవారని ఎద్దేవా చేశారు. బీజేపీ సభ్యులు సస్పెన్షన్ కోసమే అలా ప్రవర్తించారని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు సమాధానం లేక సభ నుంచి సస్పెండ్ అయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యులు సభను అడ్డగించలేదు కాబట్టే వారిని సస్పెండ్ చేయలేదని వివరించారు. సభకు ఆటంకం కలిగిస్తే స్పీకర్ నిర్ణయమే శిరోధార్యమని, శాసనవ్యవస్థలో కోర్టులు జోక్యం చేసుకోబోవని చెప్పారు.
బీజేపీ రాష్ట్రాల్లో చేస్తున్నదేమిటని నిలదీశారు. బీజేపీ రాష్ట్రాల్లో కూడా విపక్షసభ్యులను మొత్తం సమావేశాల నుంచి సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. హిమాచల్ప్రదేశ్లో గవర్నర్ దత్తాత్రేయ ప్రసంగం సందర్భంగా ఆరుగురు కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశారని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను, మహారాష్ట్రలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సంవత్సరం పాటు సస్పెండ్ చేయగా, ఇటీవల రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు న్యాయస్థానాల తలుపు తట్టి అభాసు పాలయ్యారని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ దీక్షలు ఢిల్లీలో చేయాలని బీజేపీ సభ్యులకు చురకలేశారు. బడ్జెట్, గవర్నర్ ప్రసంగాల సందర్భంగా వెల్లోకి వస్తే సస్పెండ్ చేయాలని గతంలోనే నిర్ణయించామని చెప్పారు. విభజన హామీలు నెరవేర్చే వరకు బీజేపీ నేతలు ఢిల్లీలో దీక్షలు చేయాలని ప్రభుత్వ విప్ బాల సుమన్ సవాల్ విసిరారు.
ఏడు రోజుల పనిదినాలు
శాసనసభా సమావేశాలు ఈ నెల 7నప్రారంభమయ్యాయి. మొదటిరోజే ఆర్థిక మంత్రి హరీశ్రావు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. శాసనసభ ఏడు రోజులు, శాసనమండలి నాలుగు రోజుల పాటు జరిగింది. ఈ సమావేశాల్లోనే శాసనమండలి చైర్మన్ను ఎన్నుకొన్నారు. నాలుగు బిల్లులకు ఉభయసభలు ఆమోదం తెలిపాయి.