CM Revanth Reddy | నిజామాబాద్/ఆదిలాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు ఎంతైనా వరి పండించుకోవచ్చని, రూ.500 బోనస్ అదనంగా ఇచ్చి వడ్లు కొనే బాధ్యత తమ ప్రభుత్వానిదని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ప్రస్తుత సీజన్ నుంచి కాకుండా వచ్చే పంట సీజన్నుంచి బోనస్ ఇచ్చి కొంటామని ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా అందిస్తామని బాసర సరస్వతి అమ్మవారిపై ఒట్టేసి చెప్పారు. బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని సెప్టెంబర్ 17లోపు తెరిపిస్తామని కూడా రేవంత్ ప్రకటించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి సోమవారం నిజామాబాద్, ఆదిలాబాద్లో జనజాతర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డిని గెలిపిస్తే ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా పదవి ఇప్పించే బాధ్యత తనదేనని చెప్పారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ను మిత్రమా అంటూ పలుమా ర్లు సంబోధించడం సభికులను ఆశ్చర్యానికి గురిచేసింది. నాలుగు రోజుల క్రితమే సీఎం రేవంత్రెడ్డి తనకు మిత్రుడంటూ అర్వింద్ చేసిన వ్యాఖ్య లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ప్రతి బ హిరంగ సభలో దేవుళ్లపై ఒట్టేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి ఈసారి బాసర సరస్వతి అమ్మవారిపై ఒట్టేయడం గమనార్హం. పసుపుబోర్డును ఎక్కడ ఏర్పా టు చేస్తున్నారో చెప్పకుండా బీజేపీ మోసం చేస్తున్నదని సీఎం మండిపడ్డారు. వారిచ్చిన జీవోలో నిజామాబాద్ పేరే లేదని అన్నారు. పసుపు బోర్డును ఎక్కడ, ఎప్పటిలోగా స్థాపిస్తారో కూడా చెప్పకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటివరకు ఐదింటిని అమలు చేశామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. త్వరలో రైతులకు రూ.2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని అన్నారు. రైతులు ఎంత వరి పండించినా రూ.500 బోనస్ చెల్లించి ఆ వడ్లు మొత్తం కొనుగోలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం పంటల సాగు కాలం అయినపోయినందున వచ్చే సీజన్ నుంచి ప్రభుత్వం వరికి బోనస్ చెల్లిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. ఆ ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెడుతామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ మంజురు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల ఉన్నత చదువులకు అవకాశం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. వంద రోజుల్లో తాము ఎన్నో పథకాలు అమలు చేశామని, రాష్ట్రంలో 2 కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని చెప్పారు. దీంతో ఆర్టీసీని అప్పుల ఊబి నుంచి కాపాడి 50 వేల మంది ఆర్టీసీ కార్మికులను ఆదుకున్నామని తెలిపారు.
ఇందిరమ్మ రాజ్యం ఇబ్బందుల్లో పడితే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉంటుందా మహిళలు ఆలోచించాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి ప్రమాదం వస్తే రాజీవ్ ఆరోగ్యశ్రీని అమలు చేసేవారు ఎవరని ప్రశ్నించారు. ఆదిలాబాద్లో ఆత్రం సుగుణ గెలువకపోతే పథకాలు ఆగిపోయే ప్రమాదం ఉన్నదని ప్రజలు ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ పథకాలు ఆగిపోతే పేదలకు నష్టం జరుగుతుందని అన్నారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేరవేర్చని ప్రధాని నరేంద్రమోదీకి ప్రజలు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, బీజేపీని ఓడించాలని రేవంత్రెడ్డి సూచించారు. పదేళ్లు దేశాన్ని పరిపాలించిన నరేంద్రమోదీ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పారని, ఇండ్లు కట్టిస్తామని, నిరుద్యోగులకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోగా, ట్రిపుల్ ఐటీని రద్దు చేశారని, ఐటీఐఆర్ కారిడార్, ఐఐఎం కళాశాలలను మంజూరు చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ వస్తే హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచి పెడుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించడాన్ని రేవంత్రెడ్డి తప్పు పట్టారు. మోదీ వ్యాఖ్యలతో దేశంలో అశాంతి చెలరేగుతుందని, అందుకే బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సభలో హస్తం పార్టీ నాయకులు చేదు అనుభవాన్ని చూడాల్సి వచ్చింది. సీఎం రేవంత్ ఉదయం 11 గంటలకు రావాల్సి ఉండగా మధ్యాహ్నం 1.10 గంటలకు వచ్చారు. జిల్లాలో ఎండల తీవ్రతతో సభకు వచ్చిన జనం ఎండ వేడి, ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. స్థానిక నాయకుల ప్రసంగం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 1.35 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతుండగానే సభ మధ్య నుంచి మహిళలు వెళ్లిపోయారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రూ.500 సిలిండర్, ఉచిత కరెంటు లాంటి పథకాల గురించి సీఎం మాట్లాడుతుండగా జనం నుంచి అంతగా స్పందన లభించలేదు.