హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): దేశ వ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐదంచెల వ్యూహం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. టెస్టింగ్, ట్రీటింగ్, ట్రేసింగ్, వ్యాక్సినేషన్తో పాటు ప్రజలంతా కొవిడ్ జాగ్రత్తలు పాటించేలా విస్తృత అవగాహన కల్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. రాబోయే రోజుల్లో భారీ సభలు, యాత్రలు, ప్రజలు గుమిగూడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సభలు, యాత్రలకు వచ్చేవారిలో కొవిడ్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించాలని, అక్కడికి వచ్చేవారంతా కనీసం రెండు డోసుల టీకాలు తీసుకొన్నారో లేదో పరిశీలించాలని చెప్పింది. దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారు అత్యవసరమైతే తప్ప గుమిగూడే ప్రాంతాల్లో ఉండొద్దని సూచించింది.
కరోనా కేసుల్లో స్వల్ప తగ్గుదల
రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసుల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 459 మందికి పాజిటివ్గా తేలింది. పాజిటివిటీ రేటు 1.75 శాతంగా ఉన్నది. రికవరీ రేటు 98.96 శాతానికి తగ్గింది. మరోవైపు మంగళవారం 247 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేలు దాటింది. హైదరాబాద్లో కేసుల్లో తగ్గుదల కొనసాగింది. అత్యధికంగా హైదరాబాద్లో 232, రంగారెడ్డిలో 60, సంగారెడ్డిలో 54, మేడ్చల్ మల్కాజిగిరిలో 28 కేసులు వెలుగు చూశాయి.