హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తు జరుగుతున్నదని, ఇప్పటివరకు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కేసు దర్యాప్తు ప్రారంభ దశలో ఉండగానే ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్తోపాటు మరో ఇద్దరు నిరుద్యోగులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ తప్పుపట్టారు. వారికి పిటిషన్ దాఖలు చేసే అర్హత లేదని పేర్కొన్నారు. సిట్ దర్యాప్తును అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే పిటిషన్ వేశారని చెప్పారు. కేసులో ఇద్దరే ఉన్నారని మంత్రి కేటీఆర్ చెప్పారని పిటిషనర్లు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.
ఇప్పటివరకూ తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారని వెల్లడించారు. మంత్రి ప్రకటన చేయడం సిట్ దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు సిట్ 9 మందిని అరెస్ట్ చేయడాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ పిటిషన్లను కొట్టేయాలని కోరారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేసు వేశారని ఆరోపించారు. పేపర్ల లీకేజీ కేసులో సిట్ సమగ్ర దర్యాప్తు జరుపుతున్నదని స్పష్టంచేశారు. అత్యంత క్లిష్టమైన కేసులు పరిష్కరించిన తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదనడం సరికాదని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్గా లేదనడం సరికాదని, పేపర్ల లీకేజీ వ్యవహారం బయటకు రాగానే టీఎస్పీఎస్సీ పోలీసులకు ఫిర్యాదు చేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వం కూడా సిట్కు కేసు అప్పగించిందని చెప్పారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏ కోణంలో చూసినా సీబీఐ విచారణ అవసరం లేదని తెలిపారు. పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. ఈ వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్రెడ్డి..సిట్ దర్యాప్తుపై స్టేటస్ రిపోర్టును 3 వారాల్లోగా అందజేయాలని ఆదేశించారు. కౌంటర్ దాఖలు చేయాలని సిట్, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేశారు. సిట్ రిపోర్టు ఇచ్చేందుకు కొంత సమయం కావాలని ఏజీ కోరారు.