TSPSC | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మే నెలంతా పరీక్షల బిజీ షెడ్యూల్ నమోదైంది. 2,024 ఉద్యోగాల భర్తీకి వరుసగా ఏడు పరీక్షలు జరుగనున్నాయి. ఈ నెల 8 నుంచి 22 వరకు పరీక్షల నిర్వహణకు టీఎస్పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేస్తున్నది. అత్యధికంగా 1,540 ఏఈఈ ఉద్యోగాలకు పరీక్ష జరుగనున్నది. కాగా, రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చెప్పినప్పటి నుంచి భర్తీ ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు 17,285 ఉద్యోగాలకు 26 నోటిఫికేషన్లు ఇచ్చింది. ఏడు నోటిఫికేషన్ల పరీక్షలు నిర్వహించింది. అయితే, మార్చి నెలలో టీఎస్పీఎస్సీలో కంప్యూటర్ హ్యాకింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేసింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్రూప్-1 ప్రిలిమినరీతోపాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏవో), అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పరీక్షలను రద్దు చేసింది. వీటన్నింటికీ మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది.
ప్రతి పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నది. మే నెలలో నిర్వహించబోయే కొన్ని పరీక్షలకు ప్రశ్నలు ముందుగానే రూపొందించారు. ఇటీవల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో కమిషన్ అవన్నీ పక్కన పెట్టెయ్యాలని నిర్ణయించింది. ఇకనుంచి జరుగబోయే ప్రతి పరీక్షకు కొత్తగా మళ్లీ ప్రశ్నలు సిద్ధం చేస్తున్నది. గతంలో పనిచేసిన సబ్జెక్ట్ నిపుణులను సైతం మార్చేసింది. ఎవరెవరు పనిచేస్తున్నారు? ఎంతమంది ఉన్నారు? ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు? వంటి విషయాల్లో గోప్యత పాటిస్తున్నారు.
టీఎస్పీఎస్సీ ఇకపై పరీక్షలన్నీ సీబీఆర్టీ(కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్) పద్ధతిలోనే పకడ్బందీగా నిర్వహించాలని భావిస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 50 వేల అభ్యర్థుల వరకే ఆన్లైన్ పరీక్ష నిర్వహించే వెసులుబాటు ఉన్నది. 50 వేలకంటే ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తే షిఫ్టుల వారీగా పరీక్ష నిర్వహించాల్సి వస్తుంది. అయితే, ఒక షిఫ్టులో సులభమైన ప్రశ్నలు, మరో షిఫ్టులో కఠినమైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నది. అందుకే, ఆన్లైన్ పరీక్షల్లో మార్కుల లెక్కింపునకు నార్మలైజేషన్ పద్ధతి పాటించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. నార్మలైజేషన్ విధానంలో ఐదు డెసిమల్స్ వరకు మారులను పరిగణనలోకి తీసుకొంటారు. నార్మలైజేషన్లో వచ్చిన మా రులు పరీక్షలో వచ్చిన మారులకు వ్య త్యా సం ఉంటుంది. ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల సగటు, స్టాండర్డ్ డీవియేషన్ పద్ధతి లో తీసుకొని లెక్కిస్తారు. నార్మలైజేషన్ ఫార్ములాను ఇప్పటికే ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ తదితర పోటీ, ప్రవేశ పరీక్షల్లో అమలు చేస్తున్నారు.
టీఎస్పీఎస్సీలో జరిగే పరీక్షలను సిబ్బందే పర్యవేక్షించేవారు. కమిషన్లో ఎవరెవరు ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించాలనేది చైర్మన్, సెక్రటరీలు నిర్ణయించేవారు. ప్రశ్నపత్రాల పంపిణీ నుంచి పరీక్ష ముగిసే వరకు సిబ్బందే బాధ్యత వహించేవారు. అయితే, కమిషన్ చరిత్రలో తొలిసారిగా ప్రత్యేకంగా పరీక్షల విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరీక్షల విభాగం కో ఆర్డినేషన్ బాధ్యతను ఐఏఎస్ అధికారి సంతోష్కి అప్పగించింది. ప్రశ్నపత్రాల రూపకల్పన మొదలుకొని పరీక్ష ముగిసే వరకు పరీక్షల విభాగం పర్యవేక్షిస్తుంది. మే నెల నుంచి జరిగే పరీక్షలన్నీ ఈ విభాగమే కో ఆర్డినేట్ చేస్తున్నది.