హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): వీఆర్వో వ్యవస్థను రద్దు చేసే అధికారం తమకు ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు తెలిపింది. విధాన నిర్ణయం మేరకే వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి, ఆ ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేశామని, ఈ ప్రక్రియలో ఏ ఉద్యోగినీ వీధుల్లోకి నెట్టలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వీఆర్వోల బదిలీని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కోరింది. రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులను డిజిటలైజ్ చేయడంతో వీఆర్వో వ్యవస్థతో పనిలేకుండా పోయిందని, అందుకే ఆ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసిందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వివరించారు.
ఈ నిర్ణయాన్ని వీఆర్వోలంతా ఆమోదించారని, కేవలం 60 మంది మాత్రమే విధుల్లో చేరలేదని చెప్పారు. రెవెన్యూ శాఖలోని పోస్టుల్లోనే చేరాలని కోరుకునే హకు వీఆర్వోలకు లేదని తెలిపారు. దీంతో ఈ వ్యవహారంలో పిటిషనర్ల వాదనలను వినేందుకు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన డివిజన్ బెంచ్ ప్రకటించింది.