హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పరీక్షల తేదీలను మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ నిర్వహిస్తామని చెప్పారు. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్, మే 12 నుంచి 14 వర కు ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష ఉంటుందని తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో ని తన కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణ, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణతో కలిసి ఎంసెట్ సహా ఎడ్సెట్, లాసెట్, ఐసెట్, పీజీఈసెట్, ఈసెట్ వంటి వృత్తి విద్యాకోర్సుల ప్రవేశాల షెడ్యూళ్లను సమీక్షించారు. సజావుగా పరీక్షలను నిర్వహించేందుకు సమష్టిగా పనిచేయాలని, అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తు ఫీజు, ఇతర వివరాలతో కూడిన నోటిఫికేషన్ను త్వరలోనే ప్రకటిస్తారని ఆమె పేర్కొన్నారు.
గాడిన పడ్డట్టే
తాజా షెడ్యూళ్ల ప్రకారం అన్ని రకాల ప్ర వేశ పరీక్షలు మే నెలలో జరుగనున్నాయి. ఎం టెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ ఒక్కటే జూన్ 1 వరకు నిర్వహిస్తారు. కరోనాతో 2021 ఆగస్టులో, 2022 జూలైలో పరీక్షలు ఆలస్యంగా జరిగాయి. ఇప్పుడు కరోనా లేకపోవడంతో రెండు నెలల ముందే నిర్వహిస్తుండటం విశేషం. మొత్తం మీద కరోనాతో ఇబ్బందులు పడ్డ విద్యావ్యవస్థ గాడిన పడ్డట్టేనని అధికారులంటున్నారు.