హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం తెలంగాణ ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. ఓటర్ల పరిశీలన కోసం ఉంచిన ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3.06 కోట్ల మంది ఉన్నారు. వీరిలో పురుషులు సుమారు 1.53 కోట్లు కాగా, మహిళలు 1.52 కోట్ల మంది ఉన్నారు. ఓటర్లలో కొత్తగా నమోదైన 18 నుంచి 19 ఏండ్ల మధ్య వయస్కులు 4.76 లక్షలు ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 2,133 మంది, ఎన్ఆర్ఐలు 2,742, సర్వీసు ఓటర్లు 15,337 మంది ఉన్నారు. ఈ జాబితాపై అభ్యంతరాలు, సవరణలను సెప్టెంబర్ 19వరకు స్వీకరించనున్నారు. తుది జాబితాను అక్టోబర్ 4న ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం హైదరాబాద్ జిల్లాలో 43 లక్షల 989 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 22,09,972 మంది కాగా, మహిళలు 20,90,727 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 290 మంది ఉన్నారు. జిల్లాలో అత్యధిక ఓటర్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,56,995 మంది ఉండగా, అత్యల్పంగా చార్మినార్ సెగ్మెంట్లో 2,16,643 మంది ఉన్నారు.