తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపు మేరకు తొలిరోజు జాతీయ సమైక్యతా ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో చేపట్టిన ర్యాలీల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలు జాతీయ జెండాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంలో 15 వేలకు తగ్గకుండా ప్రజలు హాజరై జాతీయ సమైక్యతాను ఎలుగెత్తి చాటారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులందరూ పాల్గొన్నారు. జాతీయ పతాకాలను చేబూని, దేశభక్తి గీతాలతో కొనసాగిన ర్యాలీలు కన్నుల పండుగగా జరిగాయి.
హైదరాబాద్, సెప్టెంబర్16 (నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్ : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ స్ఫూర్తి రాష్ట్ర నలుదిశలా ప్రస్ఫుటించింది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో వేడుకలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు పాల్గొని హోరెత్తించారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ప్రభుత్వం శుక్రవారం నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో వేడుకలు అత్యంత ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. జాతీయ పతాకాలను ధరించి భారీ ర్యాలీలు నిర్వహించారు. భారత్మాతాకి జై- జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. పలు చోట్ల కళా ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం ఆయా నియోజక కేంద్రాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభలను ఏర్పాటు చేసి సమైక్యతా దినోత్సవ విశేషాలను ప్రజాప్రతినిధులు వివరించారు. భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానం కలయికకు దారితీసిన నాటి పరిస్థితులు, అనంతర కాలంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, గడిచిన ఎనిమిదేండ్ల తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, వాటి ఫలితాలపై సంబంధిత ప్రజాప్రతినిధులు ప్రజానీకానికి వివరించారు. అనంతరం వేడుకల్లో పాల్గొన్న ప్రజలందరితో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు సామూహిక భోజనాలు చేశారు.
మిర్యాలగూడలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ర్యాలీలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, బాన్సువాడలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి పాల్గొని వేడుకలను ఘనంగా ప్రారంభించారు. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మంత్రి కేటీఆర్, సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు, నిజామాబాద్ జిల్లా బాల్కొండలో వేముల ప్రశాంత్రెడ్డి, కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, ఖమ్మంలో పువ్వాడ అజయ్కుమార్, సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి, వనపర్తిలో మంత్రి నిరంజన్రెడ్డి, హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో మంత్రులు తలసాని, మహమూద్ అలీ, మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్గౌడ్, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు, ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్, నిర్మల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రగతిని వివరించారు. సమైక్యతా స్ఫూర్తిని చాటారు.
సాయుధ పోరాటం, స్వరాష్ట్ర ఏర్పాటులో ఎన్నో త్యాగాలు చేసి పోరాడిన గడ్డ తెలంగాణ. అరవై ఏండ్ల్ల సమైక్యాంధ్ర పాలనలో జరుగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ కేవలం ఎనిమిదేండ్లలో చేసి చూపించారు. దక్షిణ భారత ధాన్యభాండాగారంగా తెలంగాణ ఎదిగింది. దేశానికే అన్నం పెట్టే స్థితికి అభివృద్ధి చెందింది. పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణను కులాలు, మతాల పేరిట కొన్ని శక్తులు విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయి. మనమంతా అప్రమత్తంగా ఉండి అలాంటి వారిని తరిమి కొట్టాలి.
– మంత్రి తన్నీరు హరీశ్రావు