వర్ని, జూన్ 8 : కుల, మతాలకతీతంగా కలిసిమెలిసి ఉంటున్న ప్రజలను విడదీసేందుకు ప్రయత్నిస్తున్న పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం అఫందిఫారం గ్రామంలో రూ.60లక్షల వ్యయంతో నిర్మించిన వంతెనను, రూ.10లక్షల వ్యయంతో నిర్మించిన సేవాలాల్ మందిరం ప్రహరీని ఆయన ప్రారంభించడంతో పాటు గ్రామంలో ఎనిమిది డబల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
కార్యక్రమానికి విచ్చేసిన స్పీకర్కు స్థానిక తండా మహిళలు గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్పీకర్ గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేసి ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేస్తున్నప్పటికి కొన్ని రాజకీయ పార్టీల నాయకులు నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారన్నారు.
ఆ పార్టీల పాలిత రాష్ర్టాల్లో ఇంత అభివృద్ధి, ఇలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెప్పి తమ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారతదేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చులు పెడుతున్న పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.