హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): దక్షిణాది రాష్ర్టాల కోసం ప్రత్యేక టూరిజం సర్క్యూట్ను ఏర్పాటుచేయాలని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్రెడ్డి ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించిన దక్షిణాది రాష్ర్టాల పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో టూరిజం పాలసీని రూపొందించి, రాష్ర్టాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. పర్యాటకులు రాష్ర్టాల మధ్య రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారి పన్నులను హేతబద్ధీకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.2,600 కోట్లతో పర్యాటకరంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ రూ.1,400 కోట్లతో యాదాద్రి దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా అభివృద్ధి చేస్తున్నారని వివరించారు.
దక్షిణాది రాష్ర్టాల పర్యాటకశాఖ మంత్రుల తదుపరి సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించాలని కోరారు. ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు సంపాదించిన రామప్ప దేవాలయాన్ని సందర్శించాలని ఈ సమావేశానికి హాజరైన సభ్యులను ఆహ్వానించారు. రామప్పను ఐకానిక్ టూరిస్ట్ డెస్టినేషన్గా గుర్తించి, ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కేంద్రాన్ని కోరారు. సమావేశంలో కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ ఎల్ మురగన్, అజయ్భట్, భగవత్ కుబా, కర్ణాటక మంత్రి ఆనంద్సింగ్, తమిళనాడు మంత్రి మదివేందన్, పుదుచ్చేరి మంత్రి చంద్రప్రియ తదితరులు పాల్గొన్నారు.