కొల్లాపూర్, మే 25 : పదో తరగతి పరీక్షలు రాయాల్సిన కొడుకును చేపల వేటకు తీసుకెళ్తున్న తల్లిదండ్రులకు చదువు ప్రాధాన్యతను పాఠశాల ఉపాధ్యాయులు తెలియజేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో చోటుచేసుకొన్నది. వివరాళ్లోకి వెళ్తే.. కొల్లాపూర్కు చెందిన విద్యార్థి లింగస్వామి తెలుగు, హిందీ పరీక్షలు రాయలేదని స్థానిక జిల్లా పరిషత్ గాంధీ స్మారకోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, ఉపాధ్యాయులు కురుమయ్య, శ్రీకాంత్ గుర్తించారు.
దాంతో వారు మంగళవారం రాత్రి సదరు విద్యార్థి ఇంటికి వెళ్లారు. ‘పరీక్ష రాయనీయకుండా బాలుడిని చేపల వేటకు తీసుకెళ్లడం కరెక్టు కాదు. మీరు పడుతున్న కష్టాలు మీ పిల్లలకు రావొద్దు. పరీక్షకు రాసేలా చూడాలి’ అంటూ బాలుడి తల్లిదండ్రులను కోరారు.
దాంతో తల్లిదండ్రులు మనసు మార్చుకొని తమ బిడ్డను పరీక్షలకు పంపించేందుకు ఒప్పుకొన్నారు. బుధవారం ఉదయం ఉపాధ్యాయుడు శ్రీకాంత్ విద్యార్థి లింగస్వామిని బైక్ మీద పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లి పరీక్ష రాయించారు. దాంతో ఉపాధ్యాయులు చేసిన కృషికి పలువురు అభినందిస్తున్నారు.