హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కరోనా నియంత్రణకు ప్రపంచంలోనే తొలిసారిగా ‘ముక్కు టీకా’ను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ ఆ దిశగా మరో ముందడుగు వేసింది. నాజల్ వ్యాక్సిన్ రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్కి కేంద్రం అనుమతి మంజూరు చేసినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) శుక్రవారం వెల్లడించింది. అడినోవైరల్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ (బీబీవీ154)గా పిలిచే ఈ టీకా తొలి దశ ట్రయల్స్ 18 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వయస్సు గల వారిపై విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపింది. డీబీటీ, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్ఏసీ) సహకారంతో భారత్ బయోటెక్ ముక్కు టీకాను అభివృద్ధి చేస్తున్నది.
స్ప్రే చేస్తే చాలు
ఈ టీకాను స్ప్రే చేయగానే ముక్కు కండరాల్లోకి వ్యాపిస్తుంది. మ్యూకస్ మెంబ్రిన్ను వేగంగా శోషించి ఇమ్యూనిటీ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. వ్యాధి నిరోధక కణాలు (టి-సెల్స్) ముక్కు, నోరు, ఊపిరితిత్తుల్లో ఏర్పడతాయి. వైరస్ శరీరంలోకి ప్రవేశించగానే అవి గుర్తించి చంపేస్తాయి.
భారత్ బయోటెక్కు ఐఐఎల్ టీకా ముడిపదార్థం
ఇండియన్ ఇమ్యూనాలజిక్స్ లిమిటెడ్ (ఐఐఎల్) ఉత్పత్తి చేసిన మొదటి బ్యాచ్ కొవాగ్జిన్ ముడిపదార్థాన్ని శుక్రవారం భారత్ బయోటెక్కు అందజేసింది. నెలకు 30 నుంచి 40 లక్షల డోసుల ముడి పదార్థాన్ని ఐఐఎల్ అందించనున్నది. డిసెంబర్ నాటికి ఈ సామర్థ్యాన్ని కోటి డోసులకు చేరువ చేయనున్నది.