హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ)/యాదగిరిగుట్ట: ఖమ్మంలో బుధవారం నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగసభ, కంటివెలుగు కార్యక్రమాలకు హాజరయ్యే ముఖ్య అతిథుల షెడ్యూల్ ఖరారైంది. కేరళ సీఎం పినరాయి విజయన్ మంగళవారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి ఇక్కడే బస చేసి, బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఖమ్మం చేరుకుని.. కంటి వెలుగులో పాల్గొంటారు.
ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. కేరళకు తిరిగి వెళ్తారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఐటీసీ కాకతీయలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి హైదరాబాద్లో బస చేస్తారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఖమ్మం చేరుకుని, మధ్యాహ్నం 1.10 గంటలకు ఖమ్మం కలెక్టరేట్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు ఖమ్మం నుంచి విజయవాడ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
అక్కడి నుంచి ఢిల్లీ వెళ్తారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్యాదవ్ మంగళవారం రాత్రి 8 గంటలకు లక్నో నుంచి బయలుదేరి రాత్రి 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఖమ్మం వెళ్తారు. 1.10 గంటలకు ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమంలో, అనంతరం బహిరంగసభలో పాల్గొంటారు. ఖమ్మం నుంచి విజయవాడ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో లక్నోకు తిరుగు ప్రయాణమవుతారు.
యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్ర సీఎం కేసీఆర్తోపాటు ఢిల్లీ, కేరళ సీఎంలు రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు, పోలీసులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హెలిప్యాడ్ ప్రాంతం, ఆలయ పరిసరాలను రాచకొండ సీపీ దేవేంద్రసింగ్చౌహాన్ స్వయంగా పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లపై కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ నారాయణరెడ్డి, ఆలయ ఈవో గీత సమీక్షించారు. బుధవారం నిర్వహించే శాశ్వత, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవాలతోపాటు ఉదయం 9 గంటలకు బ్రేక్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ఏపీలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఫ్లెక్సీలు, హోర్డింగ్లను పెద్ద ఎత్తున ఏర్పాటుచేశారు. ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్న సందర్భంగా ఇవి వెలిశాయి. గుంటూరు, విజయవాడ, యానాం, కొత్తపేట, కడియం, కాకినాడ, ముమ్మిడివరం తదితర నగరాల్లో, పట్టణాల్లోని రద్దీ ప్రాంతాల్లో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.