హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 1,654 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ మంగళవారం ఉత్తర్వు లు జారీ చేశారు. బుధవారం నుంచి గెస్ట్ లెక్చరర్ల ఎంపిక ప్రారంభంకానున్నది. 19లోపు కళాశాలలు, సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలతో పత్రిక ప్రకటనను విడుదల చేయాలి. 24 వరకు దరఖాస్తుల స్వీకరణ, 26 వరకు పరిశీలన, 27న సబ్జెక్టుల వారీగా మెరిట్ జాబితాను సెలక్షన్ కమిటీకి అధికారులు అప్పగిస్తారు. 28న ఎంపికైన అభ్యర్థుల జాబితాను జిల్లా కలెక్టర్ ప్రకటిస్తారు.
ఆగస్టు 1న ఎంపికైన అభ్యర్థులు కళాశాల ప్రిన్సిపాల్కు రిపోర్ట్చేయాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డీఐఈవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ప్రిన్సిపాలతో కూడిన త్రిసభ్య కమిటీ గెస్ట్ లెక్చరర్ల ఎంపిక చేపడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అభ్యర్థులను 1 : 3 రేషియోలో ఎంపికచేసి, జాబితాలను సెలెక్షన్ కమిటీకి పంపిస్తారు. నియామకమైన వారి సేవలను 2024 మార్చి, ఏప్రిల్ వరకు వినియోగించుకొంటారు. గతంలో సేవలందించిన వారినే ఏటా కొనసాగిస్తుండగా, ప్రస్తుతం ఈ విధానానికి ముగింపు పలికారు.