హైదరాబాద్ : మన్ను నుంచి అన్నం తీసే మానవాళికి అన్నం పెట్టేది వ్యవసాయ రంగం. అలాంటి వ్యవసాయ శాఖపై ప్రజలలో గౌరవం పెరిగింది. అత్యధిక మంది ప్రజలకు సేవలందిస్తున్నది వ్యవసాయ శాఖే అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
గురువారం అబిడ్స్ రెడ్డి హాస్టల్ ఆడిటోరియంలో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజలతో ప్రత్యేక అనుబంధం పెనవేసుకున్న శాఖ ఇదేనని మంత్రి స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ ముందుచూపు, వ్యవసాయరంగం పట్ల ఉన్న మక్కువ, అభిలాష, వ్యవసాయ శాఖ ఉద్యోగుల పనితీరు మూలంగా ప్రజల ఆదరణ పెరిగిందన్నారు.
ఏడేళ్ల క్రితం వ్యవసాయ శాఖను ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖకు గుర్తింపు పెరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో ఏఈఓలు, ఏఓలు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు.త్వరలోనే పదోన్నతులు అదనపు పోస్టుల మంజూరుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీనిచ్చారన్నారు.
సమస్యల పరిష్కారం కోసం అందరం కూర్చుని చర్చిద్దాం. ఉద్యోగ సంఘాలు ఒక్క తాటి మీదకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు , సంఘం చైర్మన్ బి.కృపాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ సత్యనారాయణ పాల్గొన్నారు.