హైదరాబాద్, మార్చి14 (నమస్తే తెలంగాణ): ఆనకట్టల భద్రతకు అధికారులే బాధ్యులని ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) కీలక సిఫారసులు చేసింది. చీఫ్ ఇంజినీర్ మొదలు దిగువస్థాయి జేఈల వరకు బాధ్యులను చేయడంతోపాటు, సదరు అధికారులకు ఉండాల్సిన అర్హతలు, అనుభవం, పొందాల్సిన శిక్షణపై కూడా స్పష్టమైన సూచనలు చేసింది.
జలాశయాల నిఘా, తనిఖీ, ఆపరేషన్, నిర్వహణ, రక్షణ, ప్రమాదాలకు బాధ్యులను నిర్ధారిస్తూ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021ని అనుసరించి ఎన్డీఎస్ఏ సిఫారసులు-2023 పేరిట కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు గురువారం ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్జైన్ గెజిట్ను విడుదల చేశారు. దీనిలో డ్యామ్ల రక్షణకు సంబంధించి పలు కీలకమైన అంశాలను పేర్కొన్నది.
ఆనకట్టల భద్రతను పర్యవేక్షణకు సంబంధించి నియమించాల్సిన అధికారుల అర్హతలను తెలపడంతోపాటు, ప్రమాదాలకు బాధ్యత వహించాల్సిన అధికారులకు సంబంధించిన నిబంధనలను కూడా స్పష్టం చేసిం ది. డ్యామ్ సేఫ్టీ చట్టాన్ని అనుసరించి నిర్దేశించిన ప్రతి ఆనకట్టకు సంబంధించిన డిజిటల్ లాగ్బుక్లను, డేటాబేస్ను ప్రతీ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్వో) తప్పకుండా నిర్వహించాలని పేర్కొన్నది. సాంకేతికాంశాలను డిజిటల్ రూపంలో పొందుపరచాలని నిర్దేశించింది.
ప్రమాదాలకు బాధ్యులు వీరే
ప్రాజెక్టుల్లో సంభవించే ప్రమాదాలపై కూడా ఎన్డీఎస్ఏ కీలక సిఫారసులను చేసిం ది. ప్రాజెక్టుల్లో ఎప్పుడు, ఎలాంటి ప్రమాదం సంభవించింది? ఫలితంగా ఏ నిర్మాణం దెబ్బతిన్నది? సీపేజీ తీరు, గుర్తించిన లీకేజీలు, భూకంపాలు, మట్టికోతకు గురవడం వంటివి ఏమైనా సంభవించాయా? అన్న వివరాలను క్రోడీకరించాలని కేంద్రం పేర్కొన్నది. ఏ అధికారి, ఏ రోజున తనిఖీ చేశారు? ఏం పరిశీలించారు? ప్రమాద నివారణకు చేసిన సిఫారసులు ఏమిటి? నిర్దేశిత సమయంలో సిఫారసు చేసిన పనులు పూర్తయ్యాయా? వంటి వివరాలను కూడా క్రోడీకరించాలని కేంద్రం స్పష్టం చేసింది.
ఆనకట్టల భద్రతకు చీఫ్ ఇంజినీర్ మొదలు దిగువ జేఈల వరకు బాధ్యులను చేయడంతోపాటు, సదరు అధికారులకు ఉండాల్సిన అర్హతలు, అనుభవం, పొందాల్సిన శిక్షణపై కూడా స్పష్టమైన సిఫారసులు చేసింది. నిర్దేశిత డ్యామ్ల పరిశోధన, రూపకల్పన, నిర్మాణంలో పాటించాల్సిన నిబంధనలు, ఇంజినీర్ల అనుభవం, అర్హతలను సైతం నిర్దేశించింది. ప్రాజెక్టుల ఎత్తు, నీటి నిల్వ సామర్థ్యాన్ని అనుసరించి చీఫ్ ఇంజినీర్ మొదలు ఏఈ వరకు బాధ్యులుగా నిర్దేశించింది. అత్యవసర కార్యాచరణ ప్రణాళికలపై పలు సిఫారసులు చేసింది.