కరీంనగర్ : భారత స్వతంత్య్రం కోసం అహర్నిశలు పోరాడిన వారి గురించి స్మరించుకుంటు వారి పోరాట త్యాగాలను భావితరాలకు చాట్టిచెప్పేలా స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహించుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
వజ్రోత్సవాల్లో భాగంగా మంత్రి బుధవారం హౌసింగ్ బోర్డు కాలనీలో ఫ్రీడం పార్క్ ను ప్రారంభించారు. కొత్తపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఫ్రీడం పార్క్ లో మొక్కలు నాటారు. అనంతరం వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రతిమ మల్టిప్లెక్స్ లో విద్యార్థుల కోసం ప్రదర్శిస్తున్న గాంధీ చిత్రాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి తిలకించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలలో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. భావితరాలకు సంపదను సృష్టించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు మొక్కలను నాటడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేలా రక్తదాన శిభిరాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను అగస్టు 8 నుంచి 22 వరకు రోజుకు ఒకటి చొప్పున నిర్వహిస్తామన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్,నగర మేయర్ వై. సునీల్ రావు పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి , మున్సిపల్ కమీషనర్ సేవా ఇస్లావత్ పాల్గొన్నారు.