హనుమకొండ, మే 4 : హనుమకొండ హంటర్రోడ్డులోని సీఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఐదెకరాల స్థలంలో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సు ఏర్పాట్లను బీఆర్ఎస్ బృందం సోమవారం పరిశీలించింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, కేతిరి వాసుదేవరెడ్డి, ఏరువ సతీశ్రెడ్డి తదితరులు సదస్సు ప్రాంగణాన్ని, పార్కింగ్ స్థలాల్లో జరుగుతున్న పనులను చూసి పలు సూచనలు చేశారు.
పక్కనే ఉన్న కొలంబియా మెడికల్ కాలేజ్ గ్రౌండ్, ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో పాలకుర్తి, ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్, వర్ధన్నపేట నియోజక వర్గాలకు చెందిన వాహనాలు, తేజస్వీ స్కూల్ గ్రౌండ్తో పాటు, భారత్ పెట్రోల్ పంపునకు ఎదురుగా ఉన్న స్థలంలో స్టేషన్ఘన్పూర్, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల వాహనాలు, పాపడమ్స్ ఎదురుగా ఉన్న పద్మాలయ ఫంక్షన్హాల్లో జనగామ నియోజకవర్గంతో పాటు జనరల్ వాహనాల పార్కింగ్ కోసం కేటాయించారు.
ఈ సదస్సుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 10వేల మంది రైతు ప్రతినిధులు హాజరు కానున్న నేపథ్యంలో ఎండ వేడిమిని తట్టుకొనేలా జర్మనీ టెంట్లు వేస్తున్నారు. పెద్ద పెద్ద కూలర్లు సమకూర్చుతున్నారు. పది వేల మందికి సరిపడేలా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి పల్లె నుంచి రైతు ప్రతినిధులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.