Congress | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటనలో అధికార కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా కాంగ్రెస్ మాత్రం మూడు స్థానాలను పెండింగ్లో ఉంచింది. 14 ఎంపీ స్థానాలను గెలుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఆ జోష్ ప్రదర్శించడం లేదన్న విమర్శ ఉంది. అభ్యర్థుల ఎంపికలో జాప్యానికి సమర్థులైన నాయకులు దొరక్కపోవడమే కారణమన్న చర్చ పార్టీలో జరుగుతున్నది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ ఇప్పటి 14మంది అభ్యర్థులను ప్రకటించింది.
వీరిలో రంజిత్రెడ్డి (చేవెళ్ల), దానం నాగేందర్ (సికింద్రాబాద్), సునీతా మహేందర్రెడ్డి (మల్కాజిగిరి), నీలంమధు (మెదక్), కడియం కావ్య (వరంగల్) ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. మిగిలిన కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నది. పారాచ్యూట్ నేతలకు టికెట్లు ఇవ్వడంపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ గెలుపు కోసం తప్పడం లేదంటూ ఇటు రాష్ట్ర నేతలు, అటు అధిష్ఠానం అసమ్మతి నేతలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నది. 6న తుక్కుగూడలో కాంగ్రెస్ సభ ఉండడంతో ఆలోగా మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారా? లేదా? అన్నది కూడా ప్రశ్నార్థకంగానే మిగిలింది. పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకుండా పార్టీ అగ్రనేతలతో ఎన్నికల ప్రచారానికి దిగడం బాగుండదని పార్టీలోని కొందరు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల్లో సామాజిక వర్గాల సమతుల్యత లోపించిందన్న విమర్శ ఉంది. ఇప్పటి వరకు 14 మంది అభ్యర్థులను ప్రకటిస్తే అందులో ఆరుగురు అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందిన (రెడ్డి) వారు ఉన్నారు. ఖమ్మం సీటును కూడా రఘురాంరెడ్డికి ఇస్తారన్న ప్రచారం జరుగుతున్నది. అదే నిజమైతే రెడ్డి సామాజికవర్గానికి ఏడు సీట్లు ఇచ్చినట్టు అవుతుంది. మూడు ఎస్సీ రిజర్వు స్థానాలనూ మాల సామాజికవర్గానికి ఇవ్వడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నేతలతోపాటు మాదిగ సామాజిక వర్గాలు, సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. మరోవైపు, బీసీలకు మూడుసీట్లు మాత్రమే ఇవ్వడంపై ఆ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీసీలకు ప్రాధాన్యం దక్కలేదని, ఇప్పుడు పార్లమెంటులోనూ అదే పరిస్థితి కనిపిస్తున్నదని బీసీలు మండిపడుతున్నారు. పెండింగ్లో ఉన్న మూడుస్థానాల్లో కనీసం కరీంనగర్ టికెట్ అయినా బీసీకి ఇవ్వాలని కోరుతున్నారు. అధిష్ఠానం మాత్రం ఆ స్థానం నుంచి వెలమ సామాజికవర్గానికి చెందిన వెలిచాల రాజేందర్రావును బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలిసింది. బీసీల నుంచి వ్యతిరేకత రాకుండా హైదరాబాద్ స్థానాన్ని మొక్కుబడిగా కేటాయించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. బీసీలు, మాదిగ సామాజికవర్గం పార్టీకి దూరమైతే ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉందని పార్టీలోని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల్లో రెడ్డి సామాజికవర్గానికి 6, ఎస్సీ-3 (మాల), ఎస్టీ-2(లంబాడి, ఆదివాసీ), బీసీ-3 (లింగాయత్, ముదిరాజ్, మున్నూరుకాపు) సామాజిక వర్గాలు ఉండగా, ఇంకా 3 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి.
1.మహబూబ్నగర్-వంశీచందర్రెడ్డ్డి
2.నల్లగొండ-రఘువీర్రెడ్డి
3.భువనగిరి-చామల కిరణ్కుమార్రెడ్డ్డి
4.నిజామాబాద్-టీ జీవన్రెడ్డి
5.చేవెళ్ల-రంజిత్రెడ్డ్డి
6. మల్కాజిగిరి-సునీతా మహేందర్రెడ్డి
7.వరంగల్-కడియం కావ్య (మాల)
8.నాగర్కర్నూల్-మల్లు రవి (మాల)
9.పెద్దపల్లి-గడ్డం వంశీకృష్ణ (మాల)
10.మహబూబాబాద్-బల్రాంనాయక్ (ఎస్టీ)
11.ఆదిలాబాద్-ఆత్రం సుగుణ (ఎస్టీ)
12.మెదక్-నీలం మధు(బీసీ)
13.జహీరాబాద్-సురేశ్ షెట్కార్ (బీసీ)
14.సికింద్రాబాద్-దానం నాగేందర్ (బీసీ)
15.ఖమ్మం-రఘురాంరెడ్డి?
16.కరీంనగర్- ఖరారు కాలేదు
17.హైదరాబాద్-ఖరారు కాలేదు