హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ముస్లిం నాయకులకు ఎమ్మెల్సీ ఇస్తానంటూ రేవంత్రెడ్డి ప్రలోభ పెడుతున్నాడని, ఆ మాటలు నమ్మొద్దని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రేవంత్రెడ్డి ఎక్కడికి వెళ్లినా.. అక్కడి ముస్లిం నేతలకు ఎమ్మెల్సీలు ఇస్తానని దొంగ హామీలు ఇస్తున్నారని విమర్శించారు. రేవంత్ మోసపూరిత మాటలు నమ్మిన మహబూబ్ ఆలం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పంచన చేరారని చెప్పారు.
తెలంగాణ భవన్లో హోం మంత్రి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నిన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్న మహబూబ్ ఆలం ఇప్పుడు దేవుడిలాంటి కేసీఆర్పై ఆరోపణలు చేయడం బాధాకరం అని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలోనే వక్ఫ్ భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపిస్తున్న మహబూబ్ అలం పెద్ద కబ్జాకోరు, నంబవర్వన్ లోఫర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మలక్పేట, మల్లేపల్లి, చంచల్గూడ వంటి ఐదు ప్రాంతాల్లో వక్ఫ్ భూములు కబ్జా చేసి, కాలేజీలు కట్టాడని ఆరోపించారు.
కేసీఆర్ పాలనలోనే ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత వక్ఫ్ భూములను కాపాడేందుకు కేసీఆర్ 22/ఏ జీవోను తీసుకొచ్చి, భూముల పరిరక్షణకు అండగా నిలిచారని చెప్పారు. ధరణి నుంచి కూడా వక్ఫ్ భూములకు రక్షణ దొరికిందని అన్నారు. మోసకారి అయిన రేవంత్రెడ్డి మాటలు విని.. బీఆర్ఎస్పై ఆరోపణలు చేయడం వారి సిగ్గుమాలిన తనానికి నిదర్శనం అని మండిపడ్డారు.
రేవంత్ గెలిచింది లేదు.. సచ్చింది లేదు.. అతను ఇస్తానన్న ఎమ్మెల్సీలకు ఆశపడి బీఆర్ఎస్ పార్టీపై నిందలు వేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రేవంత్రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ సంఘ్ పరివార్ చేతుల్లోకి వెళ్లిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మైనార్టీ ఇంచార్జ్ ఖాజా బద్రూద్దీన్, తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ సోమా భరత్కుమార్ పాల్గొన్నారు.